BJP – Janasena : ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ పార్టీకి ఎటువంటి ఢోకా లేదు. 151 మంది ఎమ్మెల్యే లు ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ 70 శాతం పైగా వైసీపీ మద్దతుదారులు సర్పంచ్ లుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు పురపాలక సంఘ ఎన్నికల్లోనూ ఇప్పటికే 15 శాతం ఏకగ్రీవంగా కైవశం చేసుకున్నారు. రాష్ట్రంలో సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో అర్హత కల్గిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఏదో ఒక లబ్ది చేకూరుతూనే ఉంది. ఎన్నికలు జరిగే పురపాలక సంఘ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు కైవశం చేసుకునేందుకు వైసీపీ సర్వశక్తులను ఉపయోగిస్తున్నది. రాష్ట్రంలో జగన్ సర్కార్ ఇంత స్ట్రాంగ్ గా ఉన్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.
BJP – Janasena : పవన్ ఏమ్మన్నారంటే?
“మున్సిపల్ ఎన్నికలలో ప్రత్యర్థులు నిలదీస్తే బెదిరింపులు, కిడ్నాప్ లు, ఎదురు తిరిగితే దాడులు, రక్తపాతం. వైసీపీని ఇలానే వదిలేస్తే వీళ్లు ఇంకా పేట్రేగిపోతారు. ఎదిరించే వ్యక్తులు లేకపోతే వీళ్ల దాష్టీకానికి అంతు లేకుండా పోతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో నడిచే బీజెపీతో కలిసి జనసేన పార్టీ సంయుక్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. విభజన అనంతరం దిశానిర్దేశం లేకుండా పోయిన రాష్ట్రానికి మార్పు రావాలనే సంకల్పంతో ఈ కలకయిక జరిగింది. రాష్ట్రంలో వైసీపీ దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచిపోరాడుతున్నాం. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం వచ్చాం, జనసేన, బీజెపీ పార్టీల ఆలోచన విధానంతో ప్రభుత్వాన్ని అతి త్వరలో స్థాపిస్తాం” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేయడంలో ఒక అర్థం ఉంటుంది. అతి త్వరలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అంటే వచ్చే అర్థం ఏమై ఉంటుంది !. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిపోయింది. కాబట్టి జమిలి ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రావడానికి మూడేళ్ల సమయం ఉంది. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఉద్దేశం ఏమిటో. దీని వెనుక బీజేపీ గేమ్ ప్లాన్ ఏమైనా ఉందా? అన్న అనుమానం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. దేశంలో బీజెపీ ట్రాక్ రికార్డు చూసుకుంటే వాళ్లు అధికారంలోకి రావాలని అనుకుంటే సీట్లు, ఓట్లతో సంబంధం లేదు అన్నది అందరికీ తెలిసిందే.
ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. ఎంఐఎం నేత, ఎంపి అసదుద్దీన్ కూడా బీజేపీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపిలో దేవాలయాలపై దాడులు చేసింది హిందూత్వవాదులేనని అన్నారు. ఏపిలో హిందూత్వ వాదం బలపడుతోందని పేర్కొన్నారు. ఏపిలో బీజేపీ చాలా మౌనంగా దూసుకువెళుతోందని అసద్ వ్యాఖ్యానించారు. హిందూత్వవాద బీజెపీని జగన్ అరికట్టే ప్రయత్నం చేయాలని లేకుంటే రాబోయే రోజుల్లో జగన్ కు కష్టాలు తప్పవంటూ హెచ్చరించారు. ఇటు అసదుద్దీన్, అటు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి.