RRR: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని దిగ్గజ దర్శకుడు రాజమౌళి “RRR” స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారా అన్నది చాలా సస్పెన్స్ గా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూశారు. ఎందుకంటే “బాహుబలి” భారతదేశ సినిమా విలువలను ప్రపంచ స్థాయిలో పెంచేసింది. అటువంటి చిత్రానికి రూపకర్త రాజమౌళి ఖచ్చితంగా బాలీవుడ్ పెద్ద నిర్మాతలతో పెద్ద హీరోలతో చేస్తారని భావించారు. కానీ రాజమౌళి తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ హీరోలతోనే.. ఎన్టీఆర్.. చరణ్ లతో “RRR” ప్రాజెక్టు ప్రకటించారు. కాగా ఏ ముహూర్తాన ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో… అన్నీ ఆటంకాలే.
షూటింగ్ స్టార్ట్ అయిన ప్రారంభంలో ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరక్కపోవడంతో పాటు ఇద్దరు హీరోలకు గాయాలు కావడంతో కొన్ని రోజులపాటు షూటింగ్ ఆగిపోవటం జరిగింది. ఆ తరువాత మహమ్మారి కరోనా వైరస్ రావటంతో దాదాపు ఏడు నెలల పాటు షూటింగ్ ఆగిపోయిన పరిస్థితి. దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయకపోవటం మాత్రమే కాక … రెండు సార్లు విడుదల తేదీ ప్రకటించి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అనేక వాయిదాల తర్వాత జనవరి 7వ తారీకు ఈ ఏడాది సినిమా రిలీజ్ చేయాలని సంక్రాంతి పండుగ క్యాష్ చేసుకోవాలని రాజమౌళి డిసైడ్ అయి డిసెంబర్ నుండి “RRR” ప్రమోషన్ లు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు అన్ని భాషలలో భారీ ఎత్తున చేశారు.
ప్రమోషన్ కార్యక్రమాలకి దాదాపు పాతిక కోట్లు ఖర్చు పెట్టినట్లు.. వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒమిక్రన్ కరోనా కేసులు పెరగటంతో సినిమా మళ్ళి వాయిదా వేయడం జరిగింది. దీంతో ప్రమోషన్ కి పెట్టిన ఖర్చు వృధా అయినా పరిస్థితి.. అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే ఇటీవల సినిమా మార్చి 25 వ తారీకు రిలీజ్ అవుతున్నట్లు కొత్త తేదీ ప్రకటించడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో… మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయినట్లు దానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. విషయంలోకి వెళితే మార్చి ఒకటో తారీకు నుండి “RRR” ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని జక్కన్న అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.