Sajjala Ramakrishna Reddy: సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ కూర్పుపై కరసత్తు జరుపుతున్నారు. మూడు రోజులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయి వివిద అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఎటువంటి లీకులు బయటకు రాకుండా సీఎం జగన్ తన టీమ్ పై కసరత్తు జరుపుతున్నారు. అయితే సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో కొత్త మంత్రుల లిస్ట్ ఇది అంటూ ప్రసారం అవుతుండటంతో ఆశావహులు, వారి అభిమానుల్లో టెన్షన్ నెలకొంటోంది. రకరకాలుగా పేర్లు బయటకు వస్తుండటంతో కొన్ని చోట్ల తమ నాయకుడి పేరు మంత్రి వర్గ లిస్ట్ లేదంటూ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు వారి నాయకుడి మద్దతుగా రాజీనామాలకు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు.
సీఎం జగన్ తో భేటీ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ కూర్పుపై సీఎం జగన్ కసరత్తు పూర్తి చేశారనీ, రాత్రి ఏడు గంటలకు రాజ్ భవన్ కు మంత్రుల జాబితా పంపడం జరుగుతుందన్నారు. ఈ సారి బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. వివిధ సామాజక సమీకరణలు, సీనియారిటీ, ఎమ్మెల్యేలపై పూర్తి స్థాయిలో సీఎం జగన్ కు అవగాహన ఉందనీ, స్వయంగా ఆయనే కసరత్తు చేస్తున్నారనీ, ఏవైనా సందేహాలు వస్తే కొందరిని పిలిచి సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. టీవిలలో వస్తున్న వార్తలు నమ్మవద్దనీ, అధికారిక జాబితా బయటకు విడుదల కాలేదని తెలిపారు.
మరో పక్క కేబినెట్ మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదించారు. ఈ ఖాళీలకు సంబంధించి కొద్దిసేపటిలో గెజిట్ నోటిపికేషన్ విడుదల కానుంది.సోమవారం (11వ తేదీ) కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో 24 మంది మంత్రులు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రుల రాజీనామా లేఖల ఫైల్ శనివారం రాత్రి సీఎంఓ కార్యాలయం నుండి రాజ్ భవన్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.