సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్పై జరిగిన దాడిలో వైసిపి నేత అంబటి రాంబాబు సహా మరో ఇద్దరిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
కోడెలపై దాడికి వీళ్లే కుట్ర పన్నారంటూ ఆయన తరుపు న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వైసిపి నేతలు అంబటి రాంబాబు,నిమ్మకాయల రాజనారాయణ,బాసు లింగారెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపి దాడిలో అంబటి పాత్ర ఉందా లేదా అన్నది నిర్ధారిస్తామని సత్తెనపల్లి డిఎస్పి కాలేషావలి తెలిపారు.
మరోవైపు కోడెలపై జరిగిన దాడిలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఇనుమట్ల గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. సిసి ఫుటేజ్లను పరిశీలించారు. 30మందిపై కేసు నమోదు చేశారు. వారిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో మహిళలలు కూడా పాల్గొన్నారని సమాచారం.
సుమారు వందమంది పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సత్తెనపల్లి డిఎస్ పి కాలేషావలి రాజుపాలెంలో ఉండి ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడిలో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు.
ఏప్రిల్ 11వ తేదీన ఇనుమట్ల గ్రామంలో పోలింగ్ సరళి పరిశీలించడానికి వెళ్లిన సమయంలో కోడెలపై దాడి జరిగింది. కోడెల పోలింగ్ కేంద్రం వద్దకు రావడాన్ని నిరసిస్తూ..ఆయనపై కొందరు దాడికి దిగారు. కోడెల కారును ధ్వంసం చేశారు. దాడిలో కోడెల దుస్తులు చిరిగిపోయాయి. ఆయనతో పాటు డ్రైవర్కి గాయాలయ్యాయి. దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇదిలా ఉంటే కోడెలపై దాడిని నిరసిస్తూ టిడిపి శ్రేణులు శనివారం నిరసన వ్యక్తం చేశాయి. సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణాపురం కూడలిలో రాస్తారోకో నిర్వహించాయి. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. టిడిపి శ్రేణుల రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గుంటూరు, అమరావతి, సత్తెనపల్లి వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.