Accident in Prakasam: ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఈ వేకువ జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మందికిపైగా గాయపడ్డారు. పెళ్లి బృందం బస్సు అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో దూసుకుపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలుతో పాటు ఒక వృద్ధుడు ఉన్నారు. పొదిలికి చెందిన పెళ్లి బృందం కాకినాడలో వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొనేందుకు ఒంగోలు ఆర్టీసీ డిపో బస్సును అద్దెకు వెళుతుండగా దర్శి వద్ద ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీను తప్పించపోయి సాగర్ కాలువలో బస్సు పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు క్షతగాత్రులు తెలుపుతున్నారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణీకులు ఉన్నారు. సమాచారం తెలియడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. బస్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలుకు తరలించారు. మరణించిన వారిలో పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ ఫ్లాజిజ్ (65), అబ్దుల్ హనీ (60), షేక్ రమీజ్ (48), ముళ్ళ నూర్జహాన్ (58), ముళ్ళ జానీ బేగం (65), షేక్ సబీనాగా గుర్తించారు. కాగా ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనతో పొదిలి గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర దిగ్భంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలని తెలిపారు.