ఎన్నికలకు అన్ని పార్టీలూ దాదాపు రెడీ అయాయి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా పార్టీ కీలక రోల్ పోషిస్తున్నాయి. మెరుగైన అభ్యర్థులను బరిలోకి దించడంతోపాటు.. ఇక్కడ వ్యూహ ప్రతివ్యూహాలతో నాయకులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ పాలిటిక్స్ ఓవర్ వ్యూ ఎలా ఉందనేది చూద్దాం..
విశాఖపట్నం జిల్లాలో 15 నియోజక వర్గాలు ఉంటే ఆరు స్థానాలకు టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. 94 స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను ఖరారు చేసి.. ప్రత్యర్థులకు షాకిచ్చారు. సీటు దక్కని నేతలను పిలిపించి బుజ్జగిస్తున్న పరిస్థితి ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. పదవులు, పీఠాలపై వారికి నమ్మకం కలిగిస్తున్నారు. ఇదేసమయంలో సర్వేలో వారి గురించి వచ్చిన మార్కులను కూడా వివరిస్తున్నారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అభ్యర్ధిత్వాలు ఊహించినట్టుగానే ఖరారయ్యాయి. హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబుకి మరోసారి టీడీపీ టికెట్ కేటాయించింది. సిట్టింగ్ ల జాబితాలో ఆయన పేరును ప్రక టించింది. 2009లో తొలిసారి గెలిచిన వెలగపూడి… ఇప్పుడు నాలుగోసారి బరిలోకి దిగుతున్నారు. ఆయనను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారా యణను వైసీపీ పోటీ పెట్టింది. దీంతో తూర్పులో రాజకీయం ఇప్పటికే వేడెక్కింది. ఇక్కడ జనసేన ఓటింగ్ బలంగా ఉంది. గెలుపు ఓటములను నిర్ధేశించే స్ధాయికి పెరిగింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున వెలగపూడి రామక్రిష్ణబాబు గెలుపొందారు.
ఇక, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గణబాబు అభ్యర్ధిత్వంను ఫస్ట్ లిస్టులోనే ప్రకటించింది. గణబాబును ఓడించాలనే గట్టిపట్టుదలతో ఇక్కడ వైసీపీ ఆడారి ఆనంద్ కుమార్ను పోటీ పెట్టింది. నగరం నడిబొడ్డున విస్తరించిన ఈ సెగ్మెంట్లో పారిశ్రామిక ప్రాంతం ఎక్కువ. ఇక్కడ ఉత్తరాది, వలస ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. గవర సామాజిక వర్గానికి ఈ సీటును ప్రధాన పార్టీలు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది.
పశ్చిమలో కాపు ఓటింగ్ కీలకమైనది. జనసేన-టీడీపీ కలయిక కొంత మేర సిట్టింగ్ ఎమ్మెల్యేకు కలిసి వచ్చే చాన్స్ ఉంది. విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ ఇక్కడ బలమైన అభ్యర్ధిగా ఉన్నారు. టీడీపీ, వైసీపీ ఒకే సామాజిక వర్గానికి చాన్స్ ఇచ్చింది. ఆడారి ఫ్యామిలీ మొదటి నుంచి టీడీపీలోనే వుంది. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ఆనంద్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరడంతో ఆయనకు స్టేట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు..2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు గెలుపొందారు.