ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ రాకుండా నియోజకవర్గ వైసిపి నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన అంబటి రాంబాబు దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేతిలో కేవలం 700 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికలలో అదే సత్తెనపల్లి నుంచి పోటీచేసి కోడెలపై 19 వేల ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. అనంతరం మంత్రివర్గం మార్పులు చేర్పుల్లో అంబటికి జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత అయిదారు నెలలుగా సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకి ఈసారి జగన్ సీటు ఇవ్వరు అంటూ ప్రచారం జరుగుతోంది.
అక్కడ నుంచి వైసీపీ తరఫున రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టిడిపి నుంచి మాజీ మంత్రి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పేరు దాదాపు ఖరారు అయింది. అయితే సామాజిక సమీకరణాల పరంగా కన్నా లక్ష్మీనారాయణ కాపు కావడంతో.. జగన్ కూడా కాపు వర్గానికి చెందిన అంబటికి సీటు ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే నియోజకవర్గంలో అంబటిని వ్యతిరేకించే నేతలు మాత్రం అంబటికి సీటు ఇస్తే తాము సహకరించేది లేదని తేల్చి చెప్తున్నారు.
తాజాగా నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నియోజకవర్గ అసమ్మతి నేతలు అంబటికి సీటు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసుకున్నారు. అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ రాకుండా చూడండి.. కాదని ఆయనకే ఇస్తే 25 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఓడిపోవడం ఖాయం అని వారంతా అనిల్ కుమార్ యాదవ్కు తేల్చి చెప్పారు. అంబటిని వ్యతిరేకించే అసమ్మతి నాయకులు.. కార్యకర్తలు అనిల్ కుమార్ ను కలిసి సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీని అంబటి ఎంత ఘోరంగా బ్రష్టు పట్టించారో వివరించారు.
అంబటి పార్టీలో ముందు నుంచి గ్రూపు విభేదాలకు ఆజ్యం పోసారని ముందు నుంచి వైసీపీలో ఉన్న వారిని చాలా ఇబ్బందులకు గురి చేశారు దందాలు చేస్తున్నారు అని ఫిర్యాదు చేశారు. జగన్ చెప్పారని.. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని గతంలో అంబటి కోసం పనిచేశాం.. ఈసారి తాము పని చేయలేం అని వారు అనిల్ కుమార్ యాదవ్ ముందు కరాకండిగా తేల్చి చెప్పారు. అయితే అనిల్ కుమార్ సైతం సత్తెనపల్లిలో తనకు మైనస్ వస్తే పార్లమెంటు సీటు మొత్తం మీద తనకు ఎఫెక్ట్ పడుతుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
చిలకలూరిపేట, వినుకొండ, పెదకూరపాడులో వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. దీనికి తోడు మాచర్లలోనూ గతంలో ఉన్నంత పట్టు ఇప్పుడు లేదు. అందుకే సత్తెనపల్లిలో అంబటి సీటు మార్పు విషయాన్ని అనిల్ కుమార్ కూడా సీరియస్గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే అంబటి వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
పైగా నియోజకవర్గంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం వారంతా అంబటి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. డాక్టర్ గజ్జల నాగభూషణ రెడ్డి – చిట్టా విజయ భాస్కర్ రెడ్డి – మర్రి వెంకట్రామిరెడ్డి – బ్రహ్మారెడ్డి – శ్రీనివాసరెడ్డి వీరంతా కూడా అంబటి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.