తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తిరుపతిలోని ఒక హోటల్లో రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, పారిశ్రామిక రంగం ప్రతినిధులతో పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. అనంతరం పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలతో చర్చ సానుకూలంగా, ప్రయోజనకరంగా జరిగిందని అన్నారు.
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పీయూష్ హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని పీయూష్ అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏపికి ఎంత సాయం చేయాలో అంతా చేశామనీ, కొన్ని చోట్ల అడ్డంకులు ఉన్నాకూడా పునర్విభజన చట్టంలోని ప్రయోజనాలకు మించి సాయం చేశామని పీయూష్ గోయల్ వివరించారు. ప్రత్యేక ప్యాకేజీ అంశంలో టిడిపి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను ఆశించిందనీ పీయూష్ గోయల్ విమర్శించారు.
ముందుగా ఆయన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.