అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయకులకు ధైర్యం నూరిపోశారు. విజయవాడ ఎ 1 కన్వెన్షన్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరూ ఒంటరివారు కాదనీ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. గెలిచినప్పుడు ఆనందం, ఓడినప్పుడు ఆవేదన ఉండటం సహజమనీ, అయినా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. తమకు ఓట్లు వేసిన ప్రజలకు, నమ్మిన కార్యకర్తలకు అండగా ఉండాల్సిన బాధ్యత నేతలకు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కార్యకర్తలు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
37ఏళ్ల టిడిపి చరిత్రలో ఐదు సార్లు అధికారంలోకి వచ్చాం, నాలుగు సార్లు ప్రతిపక్షంలో ఉన్నామని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టిడిపి శ్రేణులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దౌర్జన్యాలను ఎదుర్కొవడమే తక్షణ కర్తవ్యమని చంద్రబాబు అన్నారు.
గతంలో ఓడిన సమయంలో విశ్లేషణ చేస్తే కారణాలు తెలిసేవి, ఈ సారి ఎన్నికల్లో ఓటమికి కారణాలు కూడా తెలియడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళ్లామనీ, ప్రజలకు ఆర్థికలోటు భారం పడనివ్వలేదని చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు ముఖాముఖి చర్చలు జరిపారు. ఓటమిపై సమీక్ష చేసుకోవాలని అభ్యర్థులకు చంద్రబాబు సూచించారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, రాజ్యసభ సభ్యులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.