కీలకమైన విశాఖ పార్లమెంటు సీటులో టీడీపీ నుంచి పోటీలో ఉన్న మెతుకుమెల్లి శ్రీభరత్ వరుసగా రెండో ఓటమికి రెడీ అవుతున్నాడా ? అంటే పార్లమెంటు పరిధిలో జరుగుతోన్న తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే విధంగా ఉన్నాయి. ఎప్పుడు అయితే బొత్స ఝాన్సీకి ఇక్కడ సీటు ఇచ్చారో అప్పటికే గెలుపుపై ధీమాగా ఉన్న భరత్లో మరింత ధీమా మొదలైంది. ఝాన్సీతో పాటు బొత్స వ్యూహాలతో చాపకింద నీరులా వైసీపీ దూసుకుపోతూ వచ్చేసింది. ఎన్నికలు పది రోజులు ఉండగా గాని శ్రీ భరత్కు అసలు గ్రౌండ్ లెవల్ సీన్ ఏంటో కాని అర్థం కాలేదు.
అయితే ఇప్పటికే చేతులు కాలిపోయాయి.. ఇక ఇప్పుడు ఆకులు పట్టుకున్నా చేసేదేం లేదన్నట్టుగా వాతావరణం ఉంది. అసలు గత ఎన్నికల్లో తన పార్లమెంటు పరిధిలో నలుగురు టీడీపీ ఎంపీలు గెలిస్తేనే భరత్ ఎంపీగా గెలవలేకపోయాడు. ఇప్పుడు విశాఖ పార్లమెంటు సీటుపై వైసీపీ సామాజిక, అభివృద్ధి, ప్రాంతీయ కోణంలో పూర్తిగా పట్టు బిగించేసింది. ఈ టైంలో ఇక్కడ భరత్ గెలుపు అసాధ్యంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్. విజయమ్మ పోటీ చేసినప్పుడు కడప రౌడీలు అంటూ ప్రచారం చేసి టీడీపీ బాగా లబ్ధి పొందింది. అప్పుడు బీజేపీ నుంచి కంభంపాటి హరిబాబు గెలిచారు.
ఇప్పుడు వైసీపీ అదే స్టైల్ ప్రచారం చేస్తూ భరత్ను ఎన్నికలకు ముందే దాదాపు ఓటమి అంచుల్లోకి నెట్టేసింది. భరత్ అహంకారం కావాలా ? ఝాన్సమ్మ లాంటి సౌమ్యురాలు కావాలా ? అన్న ప్రశ్నలు వైసీపీ సంధిస్తోంది. విశాఖలో మహామహులైన టీడీపీ నేతలకే శ్రీ భరత్ దర్శన భాగ్యం కావాలంటే ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. సొంత పార్టీ నాయకులకే ఆ పరిస్థితి ఉంటే.. ఇక సామాన్యులకు.. ఆయనకు ఓట్లేసే ప్రజలకు ఆయన దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి.
బొత్స ఝాన్సీ విషయంలో అలా కాదు.. ఆమె ఎప్పుడూ విశాఖలోనే నివాసం ఉంటారు.. ఎనీ టైం ఎవ్వరు అయినా వెళ్లి కలవవచ్చు.. ఇంకా కావాలంటే ఆమె మంత్రిగా ఉన్న తన భర్త బొత్సకే స్వయంగా చెప్పి సమస్యలను పరిష్కరించే వరకు నిద్రపోరు. ఝాన్సీ జడ్పీచైర్మన్, రెండు సార్లు ఎంపీగా చేసినా కూడా సాధారణ పౌరురాలిగానే ఉంటారు. ఆమెను కలవడం ఎవ్వరికి అయినా ఈజీ.. అలాగే ఆమె తలచుకుంటే అవ్వని పని ఉండదన్నది అందరికి తెలిసిందే.
విచిత్రం ఏంటంటే ఝాన్సీ నాయకత్వాన్ని పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్క వైసీపీ అభ్యర్థి.. ఏ నేత కూడా వ్యతిరేకించడం లేదు.. కానీ టీడీపీలో ఆ పరిస్థితి లేదు. విశాఖ పార్లమెంటు పరిధిలో కూటమి నుంచి పోటీ చేస్తోన్న ఏడుగురు అభ్యర్థుల్లో ముగ్గురితో భరత్కు పొసగని పరిస్థితి. ఈ లిస్టులో గంటా, వెలగపూడి లాంటి వాళ్లు కూడా ఉన్నారు. దీనికి తోడు కమ్యూనిటీ పరంగా ఇటు కాపు, తూర్పు కాపులతో పాటు బీసీలు ఝాన్సీ కోసం ఏకమవుతున్నారు.
ఇక వైసీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఎలాగూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆ పార్టీ వైపే ఉన్నారు. ఇక విశాఖలో బీసీలు కూడా టీడీపీకి దూరమైతే ఇక భరత్ వైపు ఎవరు ఉంటారు ? అన్నది వాళ్లకే తెలియడం లేదు. ఏదేమైనా విశాఖ పార్లమెంటులో రెండోసారి అయినా గెలుపు గుర్రం ఎక్కాలని ఆశ పడుతోన్న భరత్కు దింపుడు కళ్లెం ఆశలు మినహా ఏం కనపడడం లేదు.