CM YS Jagan: అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం దేశానికే ఆదర్శనీయని సగర్వంగా తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం వైఎస్ఆర్ జిల్లాకు విచ్చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మొదటి రోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.64.54 కోట్ల పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు.
భాకరాపురం రింగురోడ్డు సర్కిల్ లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.4.54 కోట్ల వ్యయంతో నూతనంగా, అద్భుతంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయాన్ని సీఎం జగన్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భఫంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని సీఎం జగన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలను అందించగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూ.9.96 కోట్ల పాడా నిధులతో ఏపీ కార్ల్ నందు నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీ, రూ.11 కోట్ల వ్యయం నిర్మించిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ లాబొరేటరీని సీఎం జగన్ ప్రారంభించారు. పులివెందుల వాసులకు అత్యంత ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ..మొత్తం 38 ఎకరాలలో రూ.14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామం నందు ఫేస్ లిఫ్టింగ్ పనులను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
ఇందులో 28 ఎకరాల్లో శిల్పారామం కాగా 10 ఎకరాల్లో ఫంక్షన్ హాల్ నిర్మించారు. మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ విత్ గ్యాలరీ, హిల్ టాప్ టవర్ విత్ 16.5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం, హిల్ టాప్ పార్టీ జోన్, జిప్ లైన్ (రోప్ వే), బోటింగ్ ఐలాండ్ పార్టీ జోన్, చైల్డ్ ప్లే జోన్, వాటర్ ఫాల్, ఫుడ్ కోర్ట్, ఆర్టిసన్స్ స్టాల్ల్స్ తో పాటు 5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్ .రాజశేఖర్ రెడ్డి కూర్చున్న విగ్రహం తో ఆకట్టుకునే ఎంట్రీ ప్లాజా, సిసి రోడ్లు, పార్కింగ్ ఏరియా, ఆహ్లాదకరమైన గ్రీనరీ ఈ శిల్పారామం ప్రత్యేకతలుగా ఉన్నాయి.
రూ.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు సీఎం శంఖుస్థాపన చేశారు. మొదటి దశలో రూ.25 కోట్లు, రెండవ దశలో రూ.35 కోట్లు ఈ పాఠశాల నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. ఆదిత్య బిర్లా యూనిట్ ను సందర్శించిన సీఎం జగన్ ..అక్కడ పని చేస్తున్న వారితో ముచ్చటించారు. అలాగే సిబ్బందితో గార్మెంట్స్ ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సీఎం వ్యక్తిగత కార్యదర్శి దనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.