Nara Lokesh Yuvagalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20వ తేదీ ముగియనుంది. నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను జనవరి 27న కుప్పం నుండి ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ 9వ తేదీ నుండి పాదయాత్రను నిలుపుదల చేశారు. దాదాపు 79 రోజుల తర్వాత గత నెల 26న పాదయాత్రను పునః ప్రారంభించారు. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది.
ఈ నెల 20వ తేదీ భోగాపురం మండలం పొలిపల్లిలో పాదయాత్రను ముగించనున్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పోలిపల్లి గ్రామ సమీపంలోని భూమాత లేఅవట్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు హజరు అవుతారని ప్రచారం జరిగింది. సభకు సుమారు ఆరు లక్షలకుపైగా టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు హజరు అవుతారని అంచనా వేస్తున్నారు. టీడీపీ – జనసేన పొత్తు ప్రకటన తర్వాత ఇరు పార్టీల అధినేతలు పాల్గొంటున్నట్లు ప్రచారం జరగడంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
అయితే లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హజరు కావడం లేదని తెలిసింది. ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా తెలియజేశారు. 20వ తేదీన పోలిపల్లి గ్రామంలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభకు చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొంటారని చెప్పారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షల మంది కార్యకర్తలు హజరు కానున్నారని చెప్పారు. ఈ సభ విజయవంతం కోసం 16 కమిటీలు వేశామని తెలిపారు.
వైసీపీలోని అనేక మంది టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు . ఈ మధ్య చంద్రబాబు అరెస్టుతో మేనిఫెస్టో ఇంకా సిద్దం కాలేదన్నారు. మేనిఫెస్టో సిద్దం కాకపోవడంతో ఈ సభకు పవన్ కళ్యాణ్ హజరు కావడం లేదని అచ్చెన్నాయుడు చెప్పారు. త్వరలో పూర్తి మేనిఫెస్టో సిద్దమైన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
Telangana Assembly: హాట్ హాట్ గా అసెంబ్లీ .. కేటిఆర్ వర్సెస్ రేవంత్