TDP : రాష్ట్రంలో స్థానిక పంచాయతీ ఎన్నికల సమరం జరుగుతోంది. రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓ పక్క శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అచ్చెన్నాయుడు అరెస్టును ఆ పార్టీ నేతలు ఖండిస్తూ ప్రకటనలు జారీ చేస్తుండగా మరో పక్క విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడికి పాల్పడ్డారు.
పట్టాభి మంగళవారం ఉదయం తన ఇంటికి కార్యాలయంకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు గాయాలు కాగా కారు అద్దాలు పగిలాయి. సెల్ ఫోన్ ద్వంసం అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుండగులు రాడ్ లతో దాడికి పాల్పడినట్లు చెప్పారు. తనపై విచక్షణారహితంగా రాడ్ లతో కొట్టారనీ, ఈ దాడిలో తనతో పాటు డ్రైవర్ కు కూడా గాయాలు అయినట్లు చెప్పారు.
ప్రజల పక్షాన పోరాడుతుంటే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. అయినా తాను పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు. ఈ ఘటనపై డీజీపీ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల క్రితం తన కారుపై దాడి జరిగింది ఇంత వరకూ చర్యలు తీసుకోలేదన్నారు. కాగా పట్టాభిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు బయలుదేరినట్లు తెలుస్తోంది.