Nimmagadda : రాష్ట్రంలో ఎస్ఈసీ వర్సెస్ వైసీపీ ప్రభుత్వ వైరం తారా స్థాయికి చేరింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ, నిమ్మగడ్డను ఇరుకున పెట్టాలని ప్రభుత్వం వ్యూహ ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుని అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదులు అందుకున్నా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం ఇటు ప్రభుత్వం, అటు ఎస్ఈసీ మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్న పరిస్థితులు కనిపించడం లేదు. ఈ తరుణంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ లు ఇచ్చిన సభా హక్కుల నోటీసుపై చెకచెక అడుగులు పడుతున్నాయి.
నేడు ప్రివిలేజ్ కమిటీ సభ్యుల భేటీ
నిమ్మగడ్డ రమేష్ కుమర్ పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ ఇచ్చిన సభా హక్కుల నోటీసును రూల్ 173 ప్రకారం స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయం మేరకు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్ లైన్ వర్చ్యూవల్ విధానం ద్వారా ప్రివిలేజ్ కమిటీ ప్రత్యేకంగా భేటీ కానున్నది. ఈ భేటీలో నిమ్మగడ్డ సభా హక్కుల ఉల్లంఘనపై విచారణ జరపనున్నది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయం ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ ఎదుట హజరు కావాలని నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. ప్రివిలేజ్ కమిటీ విచారణపై నిమ్మగడ్డ ఇంత వరకూ స్పందించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపిలో తొలి సారిగా రెండు వ్యవస్థల మధ్య జరుగుతున్న వైరం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.