ఏపిలో మరో పది నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రెండు రాజకీయ పార్టీలు రానున్నాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం వచ్చే నెలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సింహ గర్జన పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు రీసెంట్ గా ఆయన విజయవాడలో వెల్లడించారు. ఆ సందర్భంగా పోస్టర్ లను ఆవిష్కరించారు. తాజాగా ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.
తెలుగు భాష పరిరక్షణ కోసం పార్టీ పెడుతున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ పేరు జై తెలుగు పార్టీ అని విజయవాడలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. మన సంస్కృతిని, భాషను మనమే కాపాడుకోవాలని జొన్నవిత్తుల ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో నాయకులు, ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు పార్టీ పెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు భాష పరిరక్షణ అజెండాతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ఆయన తెలిపారు. అడు బోడె రామచంద్ర యాదవ్ పార్టీ ప్రకటన, తాజాగా జొన్నవిత్తుల జై తెలుగు పార్టీ ప్రకటనతో ఏపి రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయంటూ సీఎం జగన్మోహనరెడ్డి పదేపదే మీటింగ్ లో విమర్శిస్తూనే ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో కేసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్రంలో పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు.
ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందున పథకాల లబ్దిదారులే మరో సారి వైసీపీకి అధికారాన్ని కట్టబెడతారు అన్న ధీమాతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆ పార్టీ నేతలు ఉన్నారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారనీ, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని టీడీపీ వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని జనాలు నమ్ముతున్నారని అందుకే ప్రజలు టీడీపీకి పట్టం గడతారని ఆ పార్టీ ధీమాతో ఉంది. మరో పక్క తనకు ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా నిలుపుతానని వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనాలకు హామీ ఇస్తున్నారు. ఇలా ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రధాన పార్టీలు జనాల్లోకి వెళుతుండగా, తాజాగా వస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ప్రజా సింహగర్జన పార్టీ, జొన్నవిత్తుల వారి జై తెలుగు పార్టీల ప్రభావం ఏ పార్టీపై పడుతుంది.. ఈ పార్టీలు ఏ పార్టీతోనైనా కలిసి పని చేస్తాయా అని చర్చించుకుంటున్నారు.
CM YS Jagan: పేద విద్యార్ధుల ఫీజులకు వెనుకాడకుండా కోటి 80 లక్షల వరకూ చెల్లిస్తున్నాం – సీఎం జగన్