TTD: లోక కల్యాణార్థం టీటీడీ పరిపాలన భవనంలోని పరేడ్ మైదానంలో ఈ నెల 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నట్లు జేఈవో సదా భార్గవి తెలిపారు. మంగళవారం జేఈవో అధికారులతో కలిసి పరేడ్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం కార్యక్రమాన్ని టీటీడీ గతంలో విశాఖపట్నం, కోవూరులో నిర్వహించినట్లు చెప్పారు. తిరుపతిలో మొదటి సారిగా ఏడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇందులో వేదాల ప్రాముఖ్యత, వేదాలు ఎలా ఉద్భవించాయి, వేదాల విశిష్టత, వేదాలు ప్రపంచానికి ఏ విధంగా మేలు చేస్తాయనే అంశాలపై ప్రముఖ పండితులతో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
చతుర్వేద హవనంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్టాల నుండి 32 మంది రుత్వికులు ఈ కార్యక్రమాన్ని శాస్రోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. మైదానాన్ని ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఉదయం హోమ కార్యక్రమాలు, సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, తరిగొండ వెంగమాంబ చరిత్ర ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు వీక్షించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదాశివమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఏపిలో కొత్తగా మరో రెండు రాజకీయ పార్టీలు