మెగా కుటుంబంలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం.. ఆయన పోటీ చేస్తున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఆయనను గెలిపించేందుకు మెగా బ్రదర్ నాగబాబు కుటుంబం అక్కడే తిష్ట వేసింది. ఆయన, ఆయన సతీమణి, కుమారుడు, మేనల్లుడు పిఠాపురంలో పర్యటిస్తూ.. ప్రచారం చేస్తున్నారు. మెగా కుటుంబం నుంచి వీరు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నా.. కీలకమైన మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారు వచ్చి ప్రచారం చేస్తారని.. కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది.
అంతేకాదు.. మీడియాకు మెగా కుటుంబం నుంచి లీకులు కూడా వచ్చాయి. చిరంజీవి ఈ నెల 7(మంగళవారం) పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తారని అందరూ అనుకున్నారు. ఇదే వార్తల్లోనూ వచ్చింది. కానీ, ఆయన ఒక వీడియో సందేశం ఇచ్చి.. చేతులు దులుపుకోవడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమ్మ కడుపున చివరివాడిగా పుట్టినా.. ప్రజల కోసం నిలిచాడని.. జనమేయజయుడి మాదిరిగా ప్రజల కోసం.. పనిచేస్తున్నాడని.. అధికారం లేకున్నా.. ప్రజలకు సేవ చేస్తున్నాడని.. కాబట్టి ఎమ్మెల్యే అయితే.. ఆయన గళం అసెంబ్లీలో వినిపిస్తే.. మరింత మేలు జరుగుతుందని చిరు ఆ వీడియో సందేశంలో చెప్పుకొచ్చారు. ఇక, ఈ సందేశం తర్వాత.. మెగా స్టార్ క్షేత్రస్థాయిలో పర్యటించేది లేదని తేలి పోయింది.
ఇక, చిరు కుమారుడు, మరో మెగా స్టార్ రామ్ చరణ్ కూడా మాటతో సరిపుచ్చారు. తాజాగా ఆయన కూడా తన తండ్రి చేసిన వీడియోను రీ పోస్టు చేసి.. దాని కింద ఒక కామెంట్తో సరిపుచ్చారు. `మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్ గారిని గెలిపించండి` అని రామ్ చరణ్ తెలిపారు. ఇది కూడా కామెంట్తోనే సరిపుచ్చారు. మరో 4 రోజుల్లో ప్రచారానికి బ్రేకులు పడనున్నాయి. ఈ నాలుగు రోజులు మాత్రమే ప్రత్యక్ష ప్రచారానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెగా కుటుంబం ఇలా వీడియో సందేశా లకే పరిమితం కావడం అభిమానులకు కొరుకుడుపడడం లేదు.
వీడియో సందేశాల ప్రభావం ఎలా ఉన్నా.. ప్రత్యక్షంగా కార్యరంగంలోకి దిగి.. పిఠాపురంలో ప్రచారానికి వస్తే.. ఆ రేంజ్ వేరుగా ఉంటుందని మెగా ఫ్యాన్స్ అంచనా. కానీ, చిరు కుటుంబం ఎందుకో వెనుకడుగు వేసింది. దీనికి కారణాలపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. చిరు నేరుగా బయటకు వచ్చి.. పవన్కు ప్రచారం చేస్తే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున తనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇదేసమయంలో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోని తాను.. ఇలా ప్రచారం చేయడం సరికాదని అనుకున్నారో..లేక విశ్వంభర షూటింగులో బిజీగా ఉన్నారో.. మొత్తానికి చిరు కుటుంబం ఈ సారికి సందేశాలకే పరిమితం కావడంపై చర్చ హాట్ హాట్గానే సాగుతుండడం గమనార్హం.