రాయలసీమ రాయలేలిన సీమ. ఇప్పుడు రాయలసీమను గెలిచినవారు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అనంతపురం 14, కర్నూల్ 14, కడప 10, చిత్తూరు 14 స్థానాలు ఉన్నాయి. అయితే.. గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది కేవలం 3 సీట్లు. అందులో ఒకటి అప్పటి ముఖ్యమంత్రి , పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు గెలిచిన కుప్పం. ఇంకోటి ఆయన వియ్యంకుడు బాలకృష్ణ గెలిచిన హిందూపురం, మరొకటి అదే జిల్లాలో పయ్యావుల కేశవ్ గెలిచిన ఉరవకొండ.
రాష్ట్రానికి సంబంధించినంత వరకు అధికార, ప్రతిపక్ష నేతలిద్దరూ సీమ వాసులే. ప్రస్తుత ఎన్నికల వ్యవహారాన్ని గమనిస్తే.. 3 రాజధానుల నిర్ణయంపై కోస్తాలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి ఓట్లు తగ్గినా.. తనను తిరిగులేని స్థానంలో నిలబెట్టేది సీమేనని సీఎం జగన్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక ముందు నుంచి రాయలసీమ అంటేనే వైసీపీకి కంచుకోటగా ఉంటోంది. ఈ సారి కూడా ఇక్కడ తనకు అదే పట్టు ఉంటుందన్నది జగన్ అంచనా.
గ్రేటర్ రాయలసీమ.. సీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుకుంటే వైసీపీ పట్టు ఏ మాత్రం సడలేదన్నది జగన్ ధీమా. ఆ ధీమా, నమ్మకాన్ని వమ్ముచేయాలనేది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహంగా ఉంది. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు `నేనూ రాయలసీమ వాసినే` అని ఎలుగెత్తి చాటటం వెనుక సీమలో జగన్ ప్రాబల్యాన్ని తగ్గించాలనే వ్యూహం ఉంది.
యువగళం ప్రభావం ఎంత..
కొన్నాళ్ల క్రితం.. టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర సీమలో ఎక్కువగానే సాగింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ నేతలు కవ్వింపులకు పాల్పడినా.. లోకేష్ పట్టుబట్టి యువగళం యాత్రను అక్కడి నుంచే మొదలుపెట్టారు. మొదట్లో కాస్త వెనుకబడినట్లు కనిపించినా క్రమ క్రమంగా ఊపందుకుంది. లోకేష్ పాదయాత్ర మొత్తంలో సీమలోనే దాదాపు 1500 కిలోమీటర్లకుపైగా నడిచారు. 170 రోజుల పాటు ఈ యాత్ర సీమలో సాగింది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర తమకు మేలు చేస్తుందన్న అంచనాలు అప్పట్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటనేది చూడాలి.
కిందటి ఎన్నికల్లో 49 స్థానాల్లో విజయం దక్కించుకున్న వైసీపీకి ఇప్పుడు పార్టీలో సెగలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కోనేటి ఆదిమూలం వంటి బలమైన ఎస్సీ నాయకుడు పార్టీకి దూరమయ్యారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా రిజైన్ చేశారు. సీమ నుంచే బలమైన వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారు. నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఘోరంగా ఉంది. బలమైన నేతలు వైసీపీ కి బైబై చెప్పేస్తున్నారు.
అనంతపురం, కడపలోనే పరిస్థితులు చాలా వరకు మారాయి. ఈ నేపథ్యంలో ఈ దఫా ఇన్నిసీట్లు దక్కడం కష్టమనే వాదన ఒకవైపు వినిపిస్తుండగా.. తమ పథకాలే తమకు అండగా ఉంటాయని సీఎం జగన్ భావిస్తున్నారు. ఒకవేళ వ్యతిరేకత వచ్చినా బీసీలకు పెద్దపీట వేస్తున్నందున వారి ఓట్లు భర్తీ చేస్తాయన్నది వైసీపీ లెక్కగా ఉందని అంటున్నారు. మరి చూడాలి ఎవరి వ్యూహం ఎలా పనిచేస్తుందో..!