వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 నినాదాన్ని ఎత్తుకున్న వైసీపీకి.. పట్టణ ఓటరు కరుణ ఏమేరకు ఉంది? పట్టణ స్థాయిలో ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ ఏమేరకు విజయం దక్కించుకుంటుంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అయితే.. ఈ విషయంలో మేధావుల నుంచి సాధారణ విశ్లేషకుల వరకు.. అందరూ చెబుతున్న మాట.. పట్టణ ఓటరు వైసీపీకి దూరమనే. దీనికి కారణాలు.. చాలనే ఉన్నాయని అంటున్నారు. విశాఖ నుంచి అనంతపురం వరకు.. దాదాపు 70-85 నియోజకవర్గాలు పట్టణాల పరిధిలో ఉన్నాయి.
ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? ఏ విధంగా నాయకులు దూసుకుపోతున్నారు? అనే విషయాలపై దృష్టి పెడుతున్న వైసీపీ.. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని తెలుసుకున్నా.. పట్టించుకున్నా.. పరిశీలన చేసుకుని.. చక్కదిద్దుకునే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. దీంతో పట్టణ ఓటరు.. తన చూపును వైసీపీ నుంచి తప్పించేసి చాలా కాలమే అయిందని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణలు ఇవీ..
జగన్ అధికార పీఠమెక్కినప్పటి నుంచి పట్టణవాసులపై భారాలు మోపుతూనే ఉన్నారు. తాజాగా ఆర్థిక సంఘం ఆదేశాల మేరకు పన్నులు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇళ్ల నుంచి చెత్తను సేకరించే గ్రీన్ అంబాసిడర్లకు గౌరవ వేతనం చెల్లించేందుకు ఆస్తిపన్నుతో కలిపి వసూలు చేయనున్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్ను 5 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక, బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ ఛార్జీల వసూలుకు ఆర్థిక సంఘం సిఫారసు చేయడంతో ఆదిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.
అంటే.. ఏ టీ దుకాణం ముందైనా.. బండి ఆపితే.. పార్కింగ్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా.. వార్షిక అద్దె విలువ ఆధారిత ఆస్తిపన్ను నుంచి మూల ధన విలువ ఆధారిత పన్ను విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. భూమి విలువ భవనం విలువలో 0.13 శాతాన్ని ఆస్తిపన్నుగా నిర్ణయించారు. దీనిపైన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో భారమంతా ఒకేసారి కాకుండా ఏటా 15 శాతం పెంచుకునేలా ప్రతిపాదించారు. ఇలా నాలుగేళ్లుగా 15 శాతం ఆస్తిపన్ను పెరుగుతూ వస్తోంది.
దీంతో పట్టణ ఓటరుపై ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో ఈ ఓటరు.. వైసీపీకి కడు దూరం అయిపోయిన విషయం.. చాలా ఆలస్యంగా వెలుగు చూస్తుండడం గమనార్హం. ఇటీవల వెలువడుతోన్న పలు సర్వేల్లో అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఒక్క కడపను మినహాయిస్తే విజయవాడలో మూడు, నెల్లూరు, రాజమండ్రి రెండు, కాకినాడ రెండు, వైజాగ్లో ఐదారు సీట్లు ఇలా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ టీడీపీ కూటమి ఘనవిజయం సాధించబోతోందని తేలింది. దీనిని బట్టి పట్టణ ఓటరు వైసీపీ విషయంలో ఎంత ఆగ్రహంతో ఉన్నాడో క్లారిటీగా తెలుస్తోంది.