ఇప్పటి వరకు వైసీపీలో ఉన్న నాయకులు.. రేపో మాపో.. టీడీపీలోకి జంప్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అందరూ కలసి రండి.. ఒకే సారి కండువాలు కప్పేస్తా! అని ఆయన పిలుపునిచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వైసీపీకి చెందిన కీలక నాయకులు.. ఎమ్మెల్యేలు.. క్యూ కట్టుకుని ఒకేసారి టీడీపీ చెంతకు చేరిపోయేందుకు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
వీరిలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. ఈయన ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారు. ఇక, తన కేడర్ను కూడా ఆయన సిద్ధం చేశారు. దీనికి సంబంధించి నారా లోకేష్, చంద్రబాబుతోనూ ఆయన చర్చలు పూర్తి చేసుకున్నారు. వారి పిలుపు వస్తే చాలు.. అన్నట్టుగా వసంత ఎదురు చూస్తున్నారు. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు వసంత అనుచరులు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే దీనిని గ్రహించిన వైసీపీ మైలవరం ఇంచార్జిగా తిరుపతి యాదవ్ను నియమించింది.
ఇక, మరో ఎమ్మెల్యే కమ్ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా.. వైసీపీకి రాం రాం చెప్పనున్నారు. ఆయన దృష్టి కూడా టీడీపీపైనే ఉందని తెలుస్తోంది. ఇటీవల సీమ పర్యటనకు వచ్చిన చంద్రబాబును ఆయన రహస్యంగా కలుసుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన పూర్తి స్పష్టత వచ్చేసింది. ఆయన పార్టీలో చేరడం ఖాయమైందని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి విజయం దక్కించుకున్న ఆయన మంత్రి అయ్యారు.
అయితే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయనను టికెట్ మార్చడంతో అలిగి పార్టీకి దూరమవుతున్నా రు. మరోవైపు ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్దం సభకు రావాలని కోరినా.. గుమ్మనూరు గమ్ముగా ఉండిపోయారు. దీంతో ఆయన పోక.. టీడీపీలోకి రాక రెండూ ఖాయమయ్యాయని వైసీపీ భావిస్తోంది. ఈయన కూడా ఒకే సారి తన అనుచరులతో పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు.
ఇక, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు అనుచరులు కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. రాజకీయ భవిష్యత్తు కోసం తాజాగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాడిశెట్టి అభిమానులు, అనుచరులు నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం రింగ్ రోడ్డు శుభం కల్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆత్మీయ సమావేశంలో అనుచరుల అభిప్రాయం మేరకు కీలక నిర్ణయం తీసుకుంటామని తాడిశెట్టి వెంకటరావు, మురళి వెల్లడించారు. వీరి దృష్టి కూడా.. టీడీపీపైనే ఉందని అంటున్నారు. మొత్తంగా.. వారంతా కూడా టీడీపీ బ్యాచ్గా మారనున్నారు.