వైకాపా రెబల్ ఎంపి రఘు రామ కృష్ణంరాజు గారి భద్రత విషయంలో దాగుడు మూటలు నెలకొన్నాయి. దీనికి పాత్ర ధారి, సూత్ర ధారి రాజు గారే అయినా అసలు దోషి మాత్రం కేంద్ర మా? రాష్ట్ర మా? అనేది తెలియడం లేదు. తనకు ఎమ్మెల్యేల నుంచే రక్షణ కల్పించాలని రాజుగారు పార్లమెంట్ స్పీకర్ ఓం బిల్లాకు అర్జీ పెట్టుకున్నారు. కానీ రాష్ట్రమే రక్షణ కల్పించాల్సిన బాధ్యత తీసుకొని, మేము ఇస్తామంటూ కేంద్రానికి చెప్పిందట. కానీ ఇప్పటికీ రాజుగారికి రక్షకభటులు, రక్షణ రాలేదట. అందుకే రాజు గారు ఆందోళన పడిపోతున్నారు. ఓ వర్గం మీడియా దగ్గర తన గోడు వెళ్లబోసుకున్నారు.
మీడియాపై అభాండాలు
మా పార్టీకి, నాకు మధ్య విభేదాలు లేవు. మా పార్టీనీ, పార్టీ అధ్యక్షుల వారినీ ఎప్పుడు విమరించలేదు. భాద్యత కల్గిన కార్యకర్తగా పలు విషయాలపై ప్రభుత్వానికి సూచనలు చేశాను. పార్టీ మారే ఉద్దేశం కూడా లేదు. మా సంసారం (పార్టీ)లో నిప్పులు పోయాలని చూస్తున్నది మీరే అంటూ మీడియాపై రాజు గారు అభాండం వేశారు. పార్టీకి, ప్రభుత్వానికి విధేయుడనే అని అంటూనే తనకు కేంద్ర భద్రత కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందనీ, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి కూడా ఊడగొట్టాలని చూస్తుందని ఆరోపించడం గమనార్హం.
మొదటి నుండి నాటకీయ పరిణామాలే
రాజుగారు వ్యవహారంలో మొదటి నుంచి అన్ని నాటకీయ పరిణామాలే జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల పై వ్యాఖ్యలు చేయడం, పార్టీ అంతే అభిమానం అంటూనే జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, వ్యంగ్యంగా విజయసాయి రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం, ఇలా తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు రాజుగారు. ఈ సమయంలో ఒక ఎంపిక ఇవ్వాల్సిన సాధారణ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కల్పించడానికి ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. రాష్ట్రంలోని ప్రతిపక్ష టీడీపీ ఎంపీలుగా ఉన్న కింజరపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నానిలకు ఉన్న భద్రత కేంద్ర పరిధలోని అంశమైనా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొంటోంది. అలాగే నరసాపురం ఎంపీ రాజు గారి విషయంలోనూ ఇదే జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ రాజు గారు రాజకీయ పావుగా వైసీపీని, ఎమ్మెల్యేలని వాడుకుంటున్నారు కాబట్టి రాజు గారిని కూడా రాజకీయ పావుగానే వైసిపి వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ దాగుడు మూటలు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.