అమరావతి ఉద్యమం గత 200 రోజులుగా వైభవంగా కొనసాగుతోంది. భేష్.. రాజధానిని తరలించాల్సిన పనిలేదని, దాన్ని అమరావతిలోనే కొనసాగించాలని ఉద్యమం చేస్తున్నారు. అందుకు ప్రతిపక్ష పార్టీలు వంతపడుతున్నాయి. అందులో భాగంగానే ఆందోళనలు, దీక్షలు, ధర్నాలు చేపట్టారు. ఇక ఉద్యమంలో భాగంగా అనేక మంది లాక్డౌన్ లాంటి క్లిష్టమైన సమయంలోనూ పోరాటం కొనసాగించారు. ఆ వార్తలను పలు మీడియా సంస్థలు, చానళ్లు ప్రచురించాయి.. ప్రసారం చేశాయి. కేవలం రెండు తెలుగు దినపత్రికలు, వాటికి సంబంధించిన చానళ్లలోనే ఈ వార్తలు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే.. అసలు ఆ ఆందోళనలు ఎక్కువగా రాజధాని గ్రామాల్లో, మరీ ముఖ్యంగా కోర్ క్యాపిటల్ ఉన్న గ్రామాల్లో జరుగుతుండడం నిజంగా ఒక్కసారి గమనించాల్సిన విషయమే.
29 గ్రామాలకు చెందిన వారు 34 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారు కనుక రాజధానిని అదే ప్రాంతంలో ఉంచాలని సదరు మీడియా సంస్థల్లో వార్తలను వండి వడ్డిస్తున్నారు.. అయితే… నిజంగా ఆ పత్రికలు, టీవీ చానళ్లకు సదరు ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనల మీద ఉన్న ఆసక్తి సామాజిక ప్రయోజనం కోసమా ? లేదా సామాజిక వర్గ ప్రయోజనం కోసమా ? అనే సందేహాలను రేకెత్తిస్తోంది. రాజధాని తరలింపు వల్ల అక్కడ భూములిచ్చిన రైతులు నష్టపోతారన్నది నిజమే. వారితోపాటు అక్కడ నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా నష్టపోతారని వాదిస్తున్నారు. కానీ ఆ నష్టానికి ప్రభుత్వం జవాబుదారీగా ఎలా ఉంటుందనేది ప్రశ్న.
మీడియా సంస్థలు తలుచుకుంటే నిజంగా తిమ్మిని బమ్మిని చేయగలవు. బమ్మిని తిమ్మి చేయగలవు. 200 రోజుల నుంచి అలుపెరగకుండా రాజధాని ఉద్యమాన్ని నిరంతరాంగా నడిపిస్తున్నది మీడియా సంస్థలే. రాజధాని నిర్మాణం కోసం అనేక వర్గాల ప్రజలు తమ భూములను ఇచ్చారు. వారి త్యాగాలు, కన్నీళ్లు నిత్యం మనకు కనిపిస్తాయి. అయితే రాజధానిని తరలిస్తే నష్టపోయే వారిలో దళితులు ఎక్కువగా ఉన్నారని వాదిస్తున్నారు. అది కొంత వరకు నిజమే అయినా.. రాజధాని ప్రకటన చేయకముందు వరకు ఒకలా, చేశాక ఒకలా అన్న చందంగా మారింది. 2014 డిసెంబర్లో రాజధానిపై ప్రకటన చేయక ముందు వరకు భూములు అగ్రవర్ణాలకు ఉంటే నిమ్నజాతికి చెందిన వారు ఉపాధి కింద ఆ భూముల్లో వ్యవసాయ పనులు చేసేవారు. ఇక రాజధాని నిర్మాణం ప్రకటనతో రైతులు తమకున్న అర ఎకరా, పావు ఎకరా భూములను కూడా ఇష్టం లేకున్నా, బలవంతంగా, బెదిరింపులకు ఇచ్చేయాల్సి వచ్చింది.
ఇక రాజధాని నిర్మాణం కోసం అనేక మంది ఇచ్చిన భూములు అప్పటికే చేతులు మారాయి. మొత్తం 34వేల ఎకరాల భూములను రాజధానికి ఇవ్వగా.. అందులో దళితులు ఎందరు, రైతులు ఎందరు, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఎందరు, వారు ఎంత భూమి ఇచ్చారు, ఎంత పరిహారం పొందారు.. అన్న వివరాలను ఇప్పటికీ ఎవరూ వెల్లడించలేదు. ఆ రహస్యం వెనుక చిక్కుముడులను విప్పితే గానీ అసలు బండారం బయట పడదు. ఈ క్రమంలో రాజధాని ఉద్యమ వార్తలను నెత్తికి ఎత్తుకున్న మీడియా సంస్థలు, వాటిని నడిపిస్తున్న పెద్దల ఆంతర్యం ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. ఉద్యమ వార్తలు, ఉద్యమాలు, ఆందోళనలు పేరిట చేస్తున్న కుట్రలు, ఆ కథనాల వెనుక ఉద్దేశాలు.. ఎవరి కోసమో.. ఎవరి స్వప్రయోజనాలు, ఏ సామాజిక వర్గ ప్రయోజనాల కోసమో.. బయట పడుతుంది.