కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతాన్ని గుప్పెట్లో పెట్టుకొని గిజగిజ లాడిస్తోంది. తెలుగు రాష్ట్రాలను చిటారు కొమ్మల ఆకులు వణికినట్లు వణికిస్తోంది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పేదలు, ధనికులు, కులం, మతం, వర్గం, జాతి తేడా లేకుండా అందరికి సోకుతోంది. కొందరిని తనతో పాటు తీసుకెళుతోంది. ఇంతటి మహమ్మారి కొంత మందిలో తీర్చలేని సంతోషాన్ని కూడా ఇచ్చింది. ఊహించని పరిణామాన్ని మిగిల్చింది. ఎన్నడూ అందుకోలేని గెలుపును కూడా రుచి చూపించింది. అటువంటిదే ఈ కథ. పాపం ఒ వ్యక్తి మూడు దశాబ్దాలకు పైగా సాధించలేని ఘనతను కరోనా కారణంగా ఈ ఏడాది సాధించాడు. ఆ ఆసక్తి కధ ఏంటో చూడండి.
అది హైదరాబాద్ లోని బోలాక్ పూర్. అక్కడ పాఠశాల. అందులో నైట్ వాచ్ మెన్ గా పని చేస్తున్న వ్యక్తి నూరుద్దీన్. పాపం పదో తరగతి పాస్ అవ్వాలనేది అతని కల. 1987 నుంచి గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్లు రాస్తూనే ఉన్నాడు. ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. అన్ని భాషలు వస్తున్నా ఇంగ్లీష్ మాత్రం ఆయనకు అక్షరం ముక్క రాదు. తల కెక్కడం లేదు. అందుకే 34 సంవత్సరాల నుంచి రాయడం, ఫెయిల్ అవ్వడం, రాయడం, ఫెయిల్ అవ్వడం అతని వృత్తి గా మారింది. ఈ సారి కూడా ఫెయిల్ అవుతానని అతను సన్నిహితులకు చెప్పుకున్నాడట. కానీ కరోనా వచ్చి కాలం మార్చేసినట్లే అతని తల రాతను, అతని పరీక్ష రాతను మార్చేసింది. ఫలితాన్ని తిరగరాసింది. అతనికి తిరుగులేని విజయాన్ని ఇచ్చింది. స్కూల్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్న నూరుద్దీన్ పదవ తరగతి పాస్ అయితే పోస్ట్ పర్మినెంట్ కావడమో, ప్రమోషన్ రావడమో జరుగుతుందట. ఆ ఆశ తోనే పదవ తరగతి ఇంగ్లిష్ పరీక్ష పేపర్ రాస్తూ ఉన్నాడుట. ఈ సారి పరీక్షలు రద్దు అయి అందరినీ పాస్ చేయడంతో అయన చాలా అనందంతో ఉన్నాడట. అతని మాదిరిగానే అనేక మంది పదవ తరగతి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు రాసే వారు ఈ ఏడాది తమ పంట పండిందని భావిస్తున్నారు.