ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోము వీర్రాజుకు ఢిల్లీ లో బీజేపీ పెద్దల సమక్షంలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవదర్, జీవీఎల్ నరసింహారావు.. తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమంల జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు రాజకీయ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఏపీ రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి గురించి సోము వీర్రాజు మాట్లాడారు.
‘రాష్ట్రంలలో టీడీపీ అన్ని విధాల బీజేపీని ఇరుకున పెట్టాలని భావిస్తోంది. రాజధాని అమరావతిలోనే ఉంచాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటోంది. మోదీ ప్రధాని హోదాలో వచ్చినందున శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినందున బీజేపీపై నెపాన్ని నెట్టేస్తోంది. ఇది సరైంది కాదు. రాష్ట్ర రాజధానికి కేంద్రానికి సంబంధం లేదనే విషయాన్ని టీడీపీ విస్మరిస్తోంది. అప్పటి ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మించాలని భావించి మోదీని ఆహ్వానిస్తేనే ప్రధాని హోదాలో ఆయన వచ్చారు. కేంద్రానికి ఈ అంశంలో ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర శాఖగా అదే అవలంబిస్తాం’ అని చెప్పుకొచ్చారు.
సోము వీర్రాజు మాటల్లో రాష్ట్ర రాజధానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. పైగా.. ఈ విషయంలో టీడీపీనే తప్పు బట్టారు. బీజేపీని కావాలనే ఈ అంశంలో ఇరుకున పెట్టాలని కుట్రలు పన్నుతోందని అన్నారు. గమనిస్తే.. టీడీపీని నిందించడం.. వైసీపీని నిందించకపోవడం.. రాజధాని విషయంలో తమ పాత్ర లేదంటూ తప్పించుకోవడం కనిపిస్తోంది. ఈ విషయంపై అనాలోచితంగా మాట్లాడకపోవడం.. అత్యుత్సాహం ప్రదర్శించడం ఎంత చేటో సోము వీర్రాజుకు బాగా తెలుసు. దీంతో ఆయన బీజేపీ పెద్దల సమక్షంలోనే చాకచక్యంగా మాట్లాడారు. పైగా టీడీపీ తప్పుని, కుయుక్తుల్ని వారి సమక్షంలోనే ఎండగట్టి టీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.