రాష్ట్ర బిజెపి పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చర్చనీయాంశం అవుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. అదేంటో తెలుసుకుందాం. ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికలో బిజెపి అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు వ్యవహార శైలిని విమర్శిస్తూ కథనాన్ని ప్రచురించింది, అయితే ఈ కథనానికి పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఆయన స్వయంగా స్పందించలేదు. దానిపై ఒక్క ముక్క మాట్లాడలేదు. కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన సోము వీర్రాజు ఆ కథనంపై వెంటనే స్పందించారు. ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించారు. ఆ పత్రిక ఎండి రాధాకృష్ణకు బహిరంగ లేఖ రాశారు. ఇంత వరకూ బాగానే ఉంది. తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడిని విమర్శిస్తూ కథనం రాస్తే దానికి స్పందించడం తప్పు కాదు. చాలా మంచి పనే చేశారు.
కొద్ది రోజుల ముందుకు వెళదాం..సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టక ముందు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణపై వైసిపికి చెందిన రాజ్యసభ సభ్యుడు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ రూ.20 కోేట్లకు అమ్ముడు చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయారు దీనిలో ఎంపి సుజనా చౌదరి మధ్యవర్తిత్వం వహించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు కన్నానే ఖండించుకున్నారు. ఇది ఇప్పుడు ఎందుకంటే… తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన కన్నా లక్ష్మీనారాయణ పై వైసిపిి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణ చేస్తే ఎమ్మెల్సీ హోదాలో ఉన్న సోము వీర్రాజు నాడు విజయసాయి రెడ్డికి లేఖ రాయడం గానీ, ఆయన వ్యాఖ్యలను ఖండించడం గానీ చేయలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నాడు కన్నా విషయంలో అలా, నేడు జివిఎల్ విషయంలో ఇలా సోము వీర్రాజు వ్యవహరించడం ఏమిటి అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది కదా.
సోము వీర్రాజు తీరు చూస్తుంటే మీకు ఏమి అర్ధం అవుతుంది. జివిఎల్ పై ఈగ వాలకూడదు. కన్నా లాంటి వారిని ఎనైనా అనుకోండి అభ్యంతరం లేదు అన్నట్లుగా లేదూ. మరో విషయం ఏమిటంటే..రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి వేడుకలకు సంబంధించి బిజేపి వ్యవహార శైలి. అటు తెలంగాణలో వినాయక చవితి వేడుకలకు ఆంక్షలు విధిస్తే ఊరుకునేది లేదని అక్కడి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.. కెసిఆర్ సర్కార్ ను హెచ్చరించారు. అక్కడి సర్కార్ పై బండి సంజయ్ చాలా దూకుడుగా వెళుతున్నారు. వినాయక మండపాల జోలికి వస్తే నిమజ్జనాలను కెసిఆర్ ఇంటి ముందే చేస్తామని కూడా బండి సంజయ్ హెచ్చరించారు. మరో పక్క హైకోర్టును ఆశ్రయించి కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేలా ఆదేశాలు సాధించుకున్నారు. కానీ ఇక్కడ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ప్రభుత్వానికి ఓ లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. ఇవన్నీ ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.