కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఏర్పడిన సందిగ్దత ఎట్టకేలకు వీడిపోయింది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొంత కాలం పాటు సోనియా గాంధీ కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యుసీ భేటీలో జరిగిన వాడీ వేడీ చర్చలో నిర్ణయం తీసుకున్నారు. అయితే అది ఎంత కాలమన్నది మాత్రం తెలియపర్చలేదు. కొంత కాలం అనే తీర్మానంలో ప్రస్తావించారు.
సోనియా గాంధీ ఆరోగ్య రీత్యా తప్పుకోవాలనుకున్నా ఇతరత్రా కారణాల వల్ల ఆమె చేయకూడదనుకున్నా రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవ్వాలని తీర్మానంలో నిర్ణయించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం మొదలుకాగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్ష పదవిలో తాను కొనసాగలేనని, వేరొకరిని చూడాలని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు.
అయితే సీనియర్ నేతలు సోనియానే అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరారు. మరోవైపు ఇటీవలే 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు రాసిన లేఖ విషయంలో వాడీ వేడి చర్చ నడిచింది. ఈ లేఖ విషయంలో రాహుల్ గాంధీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ ఆసుపత్రిలో ఉన్న సమయంలో, ఎలాంటి సమాధానం ఇవ్వలేని సమయంలో లేఖ రాయడమేంటని రాహుల్ వ్యాఖ్యానించారు.