గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. వివిధ రకాలు అంశాలు ఈ చర్చలో ఉండగా ఇందులో ముఖ్యమైనదితెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ను సీఎం చేసేయడం.
కొందరు నేతలు బహిరంగంగానే ఈ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకరు. తాజాగా ఆయన టీఆర్ఎస్ ముఖ్య నేత ఒకరిపై సంచనల వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డితో మొదలయింది
హైదరాబాద్ బోయినపల్లిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభలో మాజీ శాశనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ సంచలన కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మీద ఆయన ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి పుట్టింది రెడ్డి సామాజిక వర్గంలో అయినా బడుగు వర్గాలకు చేతికర్రగా మారాడని ఆయన అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే వ్యక్తులను మనం గుర్తించాలన్న ఆయన వారికి అండగా నిలబడాలని అన్నారు. తెల్ల బట్టల వారికి మనం అమ్ముడు పోవొద్దని స్వామిగౌడ్ అన్నారు. 2500 కోట్ల వ్యక్తిని ఒక పార్టీ నిలబడితే, 3500 కోట్లు ఉన్న వ్యక్తిని మరో పార్టీ నిలబెడుతోందని ఆయన అన్నారు. అలానే ఒక పార్టీ 10 మందిని చంపినోడిని నిలబడితే మరో పార్టీ 15 మందిని చంపినోడిని నిలబెట్టాలని చూస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు గమనించి, చైతన్యం కావాలని ఆయన అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, కొత్త రాజకీయాలకు రూపుదిద్దాలని ఆయన పేర్కొన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని స్వామిగౌడ్ పేర్కొన్నారు.
ఆయనేం తక్కువ తినలేదు
మరోవైపు రేవంత్ రెడ్డి కూడా స్వామి గౌడ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎవరు ఎంత చెప్పుకున్నా స్వామిగౌడ్,శ్రీనివాస్ గౌడ్ ల పాత్ర ఎవరు కాదనలేరని, రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ… తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ నాయకత్వంలో పోరాటం చేశామని ఆయన పేర్కొన్నారు. సమైక్య పాలనలో స్వామి గౌడ్ మీద దాడి చేసిన అధికారులకే ఈరోజు అందళమెక్కించారని, బడుడుగు బలహీన వర్గాల బిడ్డ స్వామిగౌడ్ కి ఈరోజు గుర్తింపు కరువైందని అన్నారు.
దానం నాగేందర్ ఊరుకోడు మరి
అయితే, ఈ ప్రశంసల పరంపరపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలోనే బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధించాయని విశ్లేషించారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాటలకు ఏ మాత్రం విలువ లేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. వ్యక్తిగత దూషణలకి తెగబడుతూ ప్రచారం పొందాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని బడుగు, బలహీన వర్గాలకు ఉతకర్ర అనడం ఆయన వ్యక్తిగతమన్నారు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారి కుల వృత్తులకు అనేక విధాలుగా ప్రోత్సాహకాలు కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే బడుగుల ఆశాజ్యోతి అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నవ్యక్తిగత దూషణలు ఆకాశంలోకి ఉమ్మేసే చందంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.