జీహెచ్ఎంసీ ఎన్నికల సమరం ముగిసింది. ఊహించినదే కాస్త అటూ ఇటుగా అయింది. 2016లో 99 సీట్లు తెచ్చుకున్న టీఆర్ఎస్ సెంచరీ కొట్టదని.. బీజేపీ టఫ్ ఫైట్ ఇవ్వబోతోందని అందరూ దాదాపు అంచనాకు వచ్చారు. కానీ.. టీఆర్ఎస్ కు 2020 ఎన్నికలు ఇంకా గట్టి దెబ్బే కొట్టాయి. కేవలం బీజేపీ కంటే 7 సీట్లు ఎక్కవ వచ్చాయి. అయితే.. ఇప్పుడు చర్చంతా మేయర్ ఎవరనేది. రాజకీయాలు ఎలా ఉంటాయో మరోసారి తెలిపే సందర్భం వచ్చింది. కింగ్ కాదు రాజకీయాల్లో కింగ్ మేకర్ లా ఉండేవాళ్లు ఎంత కీలకమో తెలీబోతోంది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లు వచ్చిన బీజేపీ, 78 సీట్లు గెలిచిన కాంగ్రెస్ కాకుండా 37 సీట్లు వచ్చిన జేడీఎస్ నుంచి కుమారస్వామి సీఎం అయిపోయారు. ఇదే కింగ్ మేకర్..!
టీఆర్ఎస్-ఎంఐఎం భాయి.. భాయీ..
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంతగా తిట్టుకున్నా.. ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకున్నా టీఆర్ఎస్, ఎంఐఎం స్నేహితులే అనే విషయం తెలిసిందే. ఎంఐఎం అవసరం మాకు లేదు.. వాళ్లతో పొత్తు ఉండదు అని బహిరంగంగానే ప్రకటించారు టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ ను అధికారం నుంచి దించేస్తాం.. అని ఎంఐఎం నాయకులు అన్నారు. ఏకగ్రీవం అయినా కూడా వీరిద్దరి మధ్య శత్రుత్వం ఉండే అవకాశాలు తక్కువే. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు తెలిసేలా మళ్లీ ఈ రెండు పార్టీలు స్నేహం చేయబోతున్నాయి. ఇందుకు అసదుద్దీన్ ఫలితాలు వచ్చిన సాయంత్రమే చేసిన ప్రకటన ఇందుకు ఉదాహరణ. బీజేపీని ఢీ కొట్టే సత్తా కేసీఆర్ కే ఉంది ప్రకటన ఇచ్చేయడం.
చెరో రెండున్నరేళ్లా..?
కింగ్ మేకర్ అయిన ఎంఐఎం బీజేపీతో కలవదు కాబట్టి టీఆర్ఎస్ తో కలిసే మేయర్ పదవికి వెళ్తారు. అయితే.. మద్దతిస్తుందా, డిప్యూటీ మేయర్ అడుగుతారా.. లేదంటే వచ్చిన అవకాశం కాబట్టి బెట్టు చేసి మేయర్ స్థానమే అడుగుతారో చూడాలి. అదే జరిగితే చెరో రెండున్నరేళ్లు అంశం తెర మీదకు వస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో ఎంఐఎంకు డిమాండ్ చేసే స్థాయి వచ్చింది. దీనికి టీఆర్ఎస్ ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే. విచిత్రమైన విషయం ఏమిటంటే 2016లో ఎంఐఎంకు ఎన్ని సీట్లు వచ్చాయో.. 2020లో కూడా అన్నే సీట్లు వచ్చాయి.. 44. తమ ఆధిపత్యం నిలబెట్టుకున్న ఎంఐఎంకు ఆమాత్రం డిమాండ్ చేసే అధికారం ఉంది.