TRS Vs BJP: ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా దేశంలో బీజేపీ ఒక రాజకీయ శక్తి. 2014కి ముందు ఉన్న బీజేపీ వేరు. 2014 నుండి 2019 వరకూ. ఆ తరువాత ఉన్న బీజేపీ వేరు. దేశంలో బీజేపీ ఒక పెద్ద శక్తిగా తయారు అయ్యింది. బీజేపీ అనుకుంటే వ్యవస్థలను ఏ విధంగానైనా వాడుకోగలదు. ఏమైనా చేయగలదు. ఇప్పుడు ఉన్న శక్తిగా మారకముందే 2019కి ముందే చంద్రబాబు బీజేపీతో కయ్యానికి కాలు దువ్వి నరేంద్ర మోడీ, అమిత్ షాలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శించి వాళ్లతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమై దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ తో కలిపి బీజేపీ వ్యతిరేక కూటమి కట్టి పెద్ద ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా టీడీపీ చాలా నష్టపోయింది. టీడీపీ ఏ విధంగా నష్టపోయింది అనేది అందరికీ తెలుసు. ఆ సమయంలో జగన్మోహనరెడ్డి అధికారంలోకి రావడానికి బీజేపీ ఎంత సహకరించిందో, పక్కనే ఉన్న కేసిఆర్ కూడా అంతే సహకరించారు. చంద్రబాబును ఓడించడానికి బీజేపీతో పాటు కేసిఆర్ కూడా వైసీపీ (జగన్)కి సహకరించారు.
TRS Vs BJP: నాడు టీడీపీపై వరుస ఐటీ దాడులు
2019 ఎన్నికలకు ముందు టీడీపీ ముఖ్యనేతలపై వరుసగా ఐటీ దాడులు జరిగాయి. మాజీ మంత్రి నారాయణ, అప్పటి కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కు చెందిన సదరన్ కంపెనీ మీద, అప్పటి టీటీడీ చైర్మన్ గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ లతో పాటు టీడీపీకి ఆర్ధిక మూలాలుగా ఉన్న 15 మంది ఎమ్మెల్యే, ఎంపీలు తదితర నాయకులపై రెండు మూడు నెలల వ్యవధిలో ఐటీ దాడులు జరిగాయి. నగదు, కీలక పత్రాలు సీజ్ చేశారు. ఈ పరిణామం 2019 ఎన్నికల పోల్ మేనేజ్ మెంట్ లో టీడీపీకి పెద్ద దెబ్బ అయ్యింది. టీడీపీ ఇంత జరుగుతుందని ఊహించలేదు. కొన్ని కార్పోరేట్ కంపెనీలను నమ్ముకున్నారు. ఎలక్షన్ ఫండింగ్ వస్తుందని భావించారు. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా టీడీపీ ఆర్ధికంగా దెబ్బతిన్నది. అందుకే 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు చంద్రబాబును చూసుకుని కేసిఆర్ ఏమైనా అలర్ట్ అయ్యారా..? లేదా..జాగ్రత్త పడుతున్నారా ..? లేదా..? లేదు ముందు చూపు లేకుండా జాగ్రత్త లేకుండా, ప్రణాళిక లేకుండా ఎడా పెడా బీజేపీతో కయ్యం పెట్టేసుకుంటున్నారా..? అనేది ఆలోచించాల్సిన అంశమే.
బాబును చూసి అయినా కేసిఆర్ గుణ పాఠం నేర్చుకున్నారా..? లేదా..!
బీజేపీతో కాలు దువ్వాలి అంటే వాళ్ల ఆర్ధిక మూలాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ముందస్తు యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ఐటీ రైడ్స్ జరిగినా, ఏదైనా సీజ్ చేసినా వాళ్లు ప్రత్యామ్నాయం సిద్దం చేసుకోవాలి. ఆ యాక్షన్ ప్లాన్ ఉంటేనే బీజేపీ చేతిలో ఉన్న వ్యవస్థలు అన్నీ కూడా కేసిఆర్ మీద, టీఆర్ఎస్ శ్రేణుల మీదా దాడి చేసినా తట్టుకుని నిలబడగలిగే శక్తి ఉంటేనే బీజేపీతో కయ్యానికి కాలు దువ్వాలి. కేసిఆర్ ఒక విధంగా చంద్రబాబు కంటే తెలివైన నేతగానే పేరు ఉంది. దానికి తోడు చంద్రబాబు కంటే కేసిఆర్ మాటకారి. ప్రజలకు అర్ధమయ్యే రీతిలో మాట్లాడగలిగిన మాటల మాంత్రికుడు అని కూడా చెప్పవచ్చు. బీజేపీతో కయ్యం పెట్టుకున్న నేపథ్యంలో ఐటీ రైడ్స్ జరుగుతాయని తెలిసి కూడా మల్లారెడ్డి లాంటి వాళ్లను ఎందుకు అలెర్ట్ చేయలేకపోయారు..? ముందుగా అలెర్ట్ చేసి ఉంటే ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడి ఉండేది కాదు కదా..! మల్లారెడ్డి ఒక్కరే టార్గెట్ కాదు. టీఆర్ఎస్ లో 10 నుండి 15 మంది ప్రజా ప్రతినిధులపైనా ఐటీ దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఆర్ధిక స్థంబాలుగా రెండు మూడు కార్పోరేట్ శక్తులు ఉన్నాయి.
గత 8 ఏళ్లుగా తెలంగాణలో ఏ పెద్ద ప్రాజెక్టులు ఉన్నా ఆ కార్పోరేట్ శక్తుల ద్వారానే నిర్వహిస్తున్నాయి. వీళ్లు టీఆర్ఎస్ కు ఆర్ధిక స్తంబాలు. వీళ్లపై ఐటీ దృష్టి పెడితే తప్పించుకోలేరు. ఏదో ఒక చిన్న తప్పిదాన్ని పట్టుకుని కేంద్రంలోని వ్యవస్థ ద్వారా బీజేపీ వాళ్లను గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి శక్తిని ఢీకొనాలంటే పది ప్రత్యామ్నాయాలను టీఆర్ఎస్ రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే తెలంగాణలో బీజేపీని టీఆర్ఎస్ ఎదుర్కోగలదు. లేకపోతే 2019 ఎన్నికల్లో చంద్రబాబు తిన్న చావు దెబ్బకంటే ఎక్కువ దెబ్బే కేసిఆర్ కు పడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాడు చంద్రబాబు మాదిరిగానే నేడు కేసిఆర్ బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ అప్రమత్తంగా లేకపోతే ఏదైనా జరగవచ్చు..!
YSRCP MLAs: జగన్ తర్వాత టార్గెట్ ఎమ్మెల్యేలు..!? వైసీపీలో అంతర్గత మార్పులపై..!