YSRCP MLAs: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పార్టీ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల మార్పులు, చేర్పులు చేశారు. ప్రాంతీయ సమన్వయకర్తల మార్పుతో పాటు ఎనిమిది జిల్లాల్లో అధ్యక్షులను మార్చారు. విశాఖ, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు తదితర జిల్లాల అధ్యక్షులను మార్చేశారు. ఈ మార్పులు చేర్పుల్లో కొంద మందిపై వేటు, మరి కొందరిపై బదిలీ వేటు ఉంది. కొడాలి నాని ఇంతకు ముందు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉండగా, ఇప్పుడు ఆయనకు ఏ పదవి ఇవ్వలేదు. అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ కు ఉన్న రీజనల్ కోఆర్డినేటర్ పదవిని తొలగించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఇంతకు ముందు ఆయన సొంత జిల్లాకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉండగా, ఇప్పుడు ఆయనకు వేరే జిల్లాల కోఆర్డినేటర్ గా పంపారు. అదే విధంగా కీలక బాధ్యతల్లో తలమునకలై ఉన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు రీజనల్ కోఆర్డినేటర్ పదవుల నుండి తప్పించారు. ఈ చర్యల వల్ల పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఒక సందేశాన్ని ఇవ్వదల్చుకున్నారు. పార్టీకి సంబంధించి, పార్టీ సమన్వయం విషయంలో, పార్టీలో వర్గాలు, విభేదాలు, గ్రూపులు ఎక్కడ ఉన్నా చూస్తూ ఊరుకోను అన్ని తన దృష్టిలో ఉన్నాయి, అవసరమైన సందర్భాల్లో కఠిన చర్యలు తీసుకుంటాను అన్న సంకేతాన్ని ఇచ్చారు.
YSRCP MLAs: మొహామాటాలకు తావులేదు
పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల, జిల్లా అధ్యక్షుల మార్పు అయపోయింది. ఇక తర్వాత వంతు అసెంబ్లీ అభ్యర్ధులేనన్న చర్చ మొదలైంది. ఎందుకంటే..? పార్టీ అంతర్గత సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేల పనితీరు బాగుండటం లేదని జగన్మోహనరెడ్డి పదేపదే చెబుతున్నారు. పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామనీ, ఎటువంటి మొహామాటాలకు తావులేదని స్పష్టం చేస్తున్నారు. తన మీద, ప్రభుత్వం మీద 65 శాతంకుపైగా ప్రజల్లో సానుకూలత వస్తుండగా, ఎమ్మెల్యేల మీద అంతగా లేదు చెబుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ఇంటింటికి వెళ్లాలి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలి అని పదేపదే చెబుతున్నారు. పార్టీ, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఎమ్మెల్యే, ఇన్ చార్జి సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎవరు అశ్రద్దగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వము అని చెప్పేస్తున్నారు. తెలిసి తెలిసి ఓడి పోతారు అనుకున్న వారికి టికెట్ ఇచ్చి రిస్క్ ఫేస్ చేయలేను, తనకు మొహమాటాలకు తావు లేదు అని స్పష్టంగా చెప్పేశారు. ఇంతకు ముందు జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షలో ఎవరెవరి తీరు బాగాలేదు, ఎవరెవరు పని తీరు మెరుగుపచ్చుకోవాల్సి ఉంది, ఎవరు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో ఎవరెవరు వీక్ గా ఉన్నారు అనే వారి పేర్లను చదివి వినిపించారు. సెప్టెంబర్ 28న నిర్వహించిన సమీక్షలో అప్పటి వరకూ గ్రామాలకు వెళ్లని 27 మంది పేర్లనూ జగన్ వెల్లడించారు.
ఆ నియోజకవర్గాలకు అదనపు ఇన్ చార్జిలు
ఈ నేపథ్యంలోనే రీజనల్ కోఆర్డినేటర్లు, అధ్యక్షుల మార్పుతో తరువాతి టార్గెట్ ఎమ్మెల్యే అని స్పష్టం అవుతోంది. పైగా కొన్ని చోట్ల ఎమ్మెల్యే సీట్లు ఆశిస్తున్న వారు ఉన్నారు. గుంటూరు జిల్లాలో మర్రి రాజశేఖర్, కృష్ణాజిల్లా గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, మార్కాపురంలో జంగా వెంకటరెడ్డి, పొద్దుటూరులో రమేష్ యాదవ్, రాచమల్లు టికెట్ లు ఆశిస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 25 నుండి 30 నియోజకవర్గాల్లో రెండేసి గ్రూపులు ఉన్నాయి. ప్రకాశం జిల్లా చిరాలలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరామకృష్ణమూర్తి, దర్శిలో బూచేపల్లి, మద్దిశెట్టి గ్రూపులు ఉన్నాయి. అందుకే ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోయినా, సర్వే రిపోర్టు ఆధారంగా అభ్యర్ధిని మార్పు చేయాలన్న ఆలోచన ఉంటే ఆ నియోజకవర్గాలకు అదనపు ఇన్ చార్జిలను నియమించనున్నారని సమాచారం.
ఆ జిల్లాల్లో ఎక్కవగా మార్పులు..?
ఈ క్రమంలోనే తాడికొండ నియోజకవర్గానికి అదనపు ఇన్ చార్జిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి .. జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్దకు వెళ్లి ధర్నా చేశారు. అది జరిగి రెండు నెలల్లోనే డొక్కా మాణిక్యవరప్రసాద్ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయ్యారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికే అదనపు ఇన్ చార్జిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమిస్తే తట్టుకోలేని ఉండవల్లి శ్రీదేవికి ఇప్పుడు ఆయననే జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఎంపిక చేయడంతో ఆమెకు రెడ్ సిగ్నల్ పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో పని తీరు బాగోలేని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారిని, సర్వేల్లో ప్రతికూల ఫలితాలున్న వారిని ఎంపిక చేసి వారి స్థానంలో కొత్తవారిని అభ్యర్ధులుగా తీసుకువస్తారని చర్చ జరుగుతోంది. అదనపు ఇన్ చార్జిల నియామకం ద్వారా వారికి రెడ్ సిగ్నల్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు నెలల్లోనే అదనపు ఇన్ చార్జిల నియామకం జరగవచ్చని టాక్. ఉమ్మడి నెల్లూరు, ప్రకారం, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా మార్పులు ఉంటాయని భావిస్తున్నారు.