IT: తెలంగాణలో రీసెంట్ గా మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరిగి పెద్ద ఎత్తున నగదు, నగలు, ఇతర కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. దాదాపు 50 బృందాలుగా 200 మందికిపైగా ఐటీ అధికారులు ఏకకాలంలో మల్లారెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాలు, కళాశాలల్లో సోదాలు జరిపారు. ఇప్పుడు గమనించాల్సింది ఏమిటంటే ..! మల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఓ కీలకమైన ఆర్ధిక స్తంభం. ఇది అందరికీ తెలిసిన విషయం. 2000 సంవత్సరంలో ఒక్క ఇంజనీరింగ్ కళాశాలతో విద్యారంగంలోకి అడుగు పెట్టిన మల్లారెడ్డి 2005 -06 వచ్చే సరికి మూడు ఇంజనీరింగ్ కళాశాలలు కట్టారు. ఆ తరువాత ఇంజనీరింగ్ కళాశాలల విస్తరణ, మెడికల్ కళాశాలలు, హాస్పటల్స్, పెట్రోల్ బంక్ లు ఇలా అనేక రకాల వ్యాపారాలు చేస్తూ వందల కోట్ల టర్నోవర్ చేస్తున్నారు.
IT: నాడు టీడీపీ .. నేడు టీఆర్ఎస్ నేతలు
ఇప్పుడు ఆయనతో పాటు ఐటీ టార్గెట్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా..? టీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఆర్ధిక మూలాల మీద కేంద్రం దృష్టి పెట్టిందా..? కేసిఆర్ గత కొంత కాలంగా కేంద్రంపైనా, బీజేపీ పైనా కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో కేసిఆర్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఆర్ధిక శక్తులుగా ఉన్నారో వాళ్ల ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టే భాగంగానే మల్లారెడ్డిపై ఈ ఐటీ రైడ్స్ జరిగాయని భావించాలా..? అంటే మెజార్టీ వర్గాల నుండి అవుననే సమాధానం వస్తుంది. దేశంలో బీజేపీ నాయకులపై ఎక్కడా ఐటీ రైడ్స్ ఎక్కడైనా జరిగాయా.? అంటే జరగలేదు. 2019 ఎన్నికలకు ముందు కేసిఆర్ మాదిరిగానే బీజేపీని చంద్రబాబు వ్యతిరేకిస్తే టీడీపీ నాయకులపైనా ఏపిలో ఐటీ రైడ్స్ జరిగాయి కదా..! ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెందిన ఆస్తులపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.
మల్లారెడ్డి తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే…?
తెలంగాణలో మల్లారెడ్డి తర్వాత టీవీ 9 మీడియా సంస్థతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న జూపల్లి రామేశ్వరరావు పైనా కేంద్ర ప్రభుత్వ నిఘా ఉందని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి వ్యాపారాలు చేసే వారిపై దృష్టి ఉంటుంది కాబట్టి తెలంగాణ రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి ఈ ప్రచారం జరుగుతోంది. వాళ్ల జాగ్రత్తలో వారు ఉండే అవకాశం ఉంది. అలాగే మెఘా సంస్థ. కాళేశ్వరం ప్రాజెక్టు తో పాటు తెలంగాణలో అనేక పెద్ద ప్రాజెక్టులు మేఘా కృష్ణారెడ్డి చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ కేంద్రానికి ఫిర్యాదులు కూడా అందాయి. పలువురు నేతలు పదేవదే ఆరోపణలు కూడా చేస్తున్నారు.అలాగే వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లి మరీ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో అన్ని విభాగాలు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దృష్టి పెడుతున్నాయి. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన సంస్థ అయిన మేఘా ఆర్ధిక లావాదేవీల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదని తెలంగాణ రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.
ఆ పదిహేను మంది పై నిఘా..?
వీరే కాకుండా ఇటీవల టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన కొంత మంది నాయకులు ఆ పార్టీకి కీలకమైన ఆర్ధిక స్తంభాలు. వాళ్లలోని ఇద్దరు ముగ్గురుపై ఐటీ నిఘా ఉంది అని అంటున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ లోని ముగ్గురు ఎంపీలు, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో రకరకాల వ్యాపారులు చేసే ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఆర్ధిక లావాదేవీలపై ఐటీ వర్గాలు నిఘా పెట్టాయని గత రెండు నెలలుగా వీళ్ల వ్యాపారాలపై దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. రాబోయే రెండు మూడు నెలల్లో వీరందరిపై వరుసగా ఒకరి తర్వాత ఒకరిపై ఐటీ రైడ్స్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీనిలో రాజకీయ ప్రమేయం లేదని చట్టం తన పని తను చేసుకుపోతుందని చెబుతారు కానీ రాజకీయ కక్షసాధింపు చర్యలే అని ఆరోపణలు వస్తాయి. బీజేపీ దీనిలో రాజకీయ కక్షసాధింపు ఏమీ లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. టీఆర్ఎస్ నాయకులు మాత్రం బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసమే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నదని ఆరోపిస్తుంటారు. ఈ విషయాన్ని మల్లారెడ్డే స్వయంగా చెప్పారు. తమపై ఐటీ రైడ్స్ జరుగుతాయని ముందుగానే ఊహించామని అన్నారు. ఈ క్రమంలోనే మరో పది నుండి 15 మంది వరకూ ఐటీ రైడ్స్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఆర్ధిక స్తంభాలపై ఈ ప్రక్రియ కొనసాగి దెబ్బతీస్తే ఆ పార్టీ నిస్సహాయ స్థితికి వెళ్లిపోతుంది. రైడ్స్ లో ఏమీ దొరక్క ఆర్ధికంగా సేఫ్ జోన్ లో ఉంటే వాళ్ల గేమ్ వాళ్లు ఆడతారు.
TRS Vs BJP: బాబును చూసి నేర్చుకోలేదా..!? కేసిఆర్ దగ్గర కౌంటర్ ప్లాన్ లేదా..!?