దివంగత మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) భార్య శిరీష అలియాస్ పద్మక్కను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని స్వగృహంలో ఒంటరిగా ఉన్న పద్మక్కను నిన్న (శుక్రవారం) నాలుగు బృందాలుగా వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వెళ్లారు. ఇవేళ పద్మక్కతో పాటు, దడ్డు ప్రభాకర్ ల అరెస్టులకు సంబంధించి ఎన్ఐఏ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఎన్ కౌంటర్ లో దొరికిన ఆర్కే డైరీ ఆధారంగా వీరిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎన్ఐఏ వెల్లడించింది.
దుడ్డు ప్రభాకర్, పద్మక్క మావోయిస్టుల కోసం పని చేస్తున్నారని పేర్కొంది. 2019 చత్తీస్ ఘడ్ రాష్ట్రం జగదల్పుర్జిల్లాలోని టీఎస్ నగర్నార్ ప్రాంతంలోని తిరియా సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరు ఇద్దరూ పాల్గొన్నారనీ, ఈ నెల 28వ తేదీ నుండి జరగనున్న మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్దం చేశారని ఎన్ఐఏ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. జూలై 28న సమావేశం ఏర్పాటు చేసుకుని భారీ కుట్ర పన్నేందుకు మావోయిస్టు కేడర్ ప్రణాళిక సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. వీరు రాసిన లేఖలు, సాహిత్య పుస్తకాలతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం అని ఎన్ఐఏ వివరించింది.
శిరీష అలియాస్ పద్మక్క, దుడ్డు ప్రభాకర్ అలియాస్ అజయ్, అలియాస్ డీపీ వివిధ ఫ్రంట్ సంస్థల్లో పని చేస్తున్నారు. ఈ ఇద్దరు మావోయిస్టు యొక్క సాయుధ కేడర్ టేక్ ఇన్ చార్జిగా పని చేసి నిధులు కూడా పొందారు. గతంలో వీరి ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.