మహారాష్ట్ర లో జైపూర్ – ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ ఆర్పీఎఫ్ ఏఎస్ఐ తో పాటు మరో ముగ్గురు ప్రయాణీకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. విషయంలోకి వెళితే .. చేతన్ కుమార్ అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సీనియర్, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ టికారామ్ మీనా ను కదులుతున్న రైలులో తన ఆటో మెటిగ్ తుపాకీతో కాల్చారు. దీంతో అతను మృతి చెందాడు. అనంతరం చేతన్ కుమార్ మరో బోగీలోకి వెళ్లి ముగ్గురు ప్రయాణీకులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
అనంతరం నిందితుడు రైలు లోంచి కింద దూకి పారిపోయే ప్రయత్నం చేయగా, ఆర్పీఎఫ్ అధికారుల సహాయంతో స్థానిక పోలీసులు నిందితుడిని మీరా రోడ్డు వద్ద పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని బోరువాలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై రైల్వే డివిజనల్ మేనేజర్ నీరజ్ వర్మ స్పందించారు. ఈ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఎస్కారింగ్ డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లు తమకు సమాచారం తెలిసిందన్నారు. నలుగురిని అతను కాల్చి చంపాడని చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే తమ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు.
ఈ ఘటన దురదృష్టకరమని పశ్చిమ రైల్వే సీపీఆర్ఓ అన్నారు. కానిస్టేబుల్ చేతన్ కుమార్ తన సహోద్యోగి ఏఎస్ఐ టికారమ్ మీనాపై కాల్పులు జరిపాడనీ, ఈ ఘటనలో మరో ముగ్గురు ప్రయాణీకులు కూడా మృతి చెందారన్నారు. ప్రాధమిక సమాచారం ప్రకారం..అతను తన అధికారిక ఆయుధాన్ని ఉపయోగించి కాల్పులు జరిపాడన్నారు. నిందితుడిని అరెస్టు చేశారని, కాల్పులకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Visakha: రుషికొండ బీచ్ లో టూరిస్ట్ బోటు బోల్తా .. లైఫ్ జాకెట్లు ధరించడంతో పర్యాటకులు సేఫ్