Tirumala Srivari Brahmotsavalu 2023: అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండనాయుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుండి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆదివారం రాత్రి 7-8 గంటల మధ్య వైదికంగా అంకురార్పణతో ఆరంభించారు. ఇందులో భాగంగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహించారు. చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్దంగా ఈ వేడుకను నిర్వహించారు.
నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ
సోమవారం (నేడు) సాయంత్రం 6.16 – 6-30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రతువుతో బ్రహ్మోత్సవాలు పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారి సమక్షంలో అర్చక స్వాములు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకూ పెద్ద శేషవాహన సేవ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం 8 గంటల నుండి పది గంటల వరకూ, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకూ శ్రీమలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరిస్తారు. గరుడ సేవ మాత్రం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాల సమర్పణ
నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7.45 గంటలకు బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లి సమర్పిస్తారు సీఎం జగన్. పెద్ద శేష వాహన సేవలో పాల్గొని శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని రాత్రికి బస చేస్తారు. మంగళవారం ఉదయం సీఎం జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు వసతి, భోజనం, పార్కింగ్ వంటి అంశాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Vinayaka Chavithi Vratham 2023: వినాయక చవితి వ్రతం.. కథ.. పూజా విధానం ఇలా..