Telangana Assembly Elections: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పక్షాలు నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నికల సమరానికి సిద్దమయ్యాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్ధులను ప్రకటిస్తూ ఎన్నికల ప్రచార బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ మరో సారి ఘన విజయం సాధించి సీఎంగా కేసిఆర్ హాట్రిక్ రికార్డు సృష్టిస్తారంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా, కేసిఆర్ సర్కార్ పై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందనీ, ఆ సారి అధికారంలోకి వచ్చి తీరుతామని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.
ఇదే సమయంలో పలు సర్వే సంస్థలు ఓపీనియన్ పోల్ పేరుతో సర్వే రిపోర్టులను వెల్లడిస్తున్నాయి. ఒక్కో సంస్థ అంచనాలు ఒక్కో రీతిలో ఉంటున్నాయి. పలు సంస్థలు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందని, అధికారంలోకి వచ్చే చాన్స్ ఉందని అంచనాలు ఇస్తుండగా, ఇండియా టుడే సీ ఓటరు సర్వే మాత్రం హాంగ్ వచ్చే అవకాశం ఉందంటూ అంచనా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవశం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తాజాగా..తెలంగాణ ఎన్నికలపై మిషన్ చాణక్య సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇందులో బీఆర్ఎస్ కు 44.62 శాతం, కాంగ్రెస్ కు 32.71 శాతం, బీజేపీకి 17.6 శాతం, ఇతరులకు 5.04 శాతం ఓటింగ్ వస్తుందని వెల్లడించింది. సీట్ల పరంగా చూస్తే..బీఆర్ఎస్ 70 – 76 సీట్లు, కాంగ్రెస్ 25 సీట్లు, బీజేపీ 9 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పింది.
ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్ధుల ప్రకటన పూర్తి స్థాయిలో ఖరారు కాలేదనీ.. అభ్యర్ధుల ఖరారు తర్వాత పార్టీల గెలుపు అవకాశాలపై పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ 25 సీట్లు గెలుస్తుందని, పూర్తి అభ్యర్ధుల ప్రకటన తర్వాత కొన్ని సీట్లు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక బీజేపీ 9 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పింది. పూర్తి స్థాయిలో అభ్యర్ధుల ప్రకటన తర్వాత రెండు మూడు సీట్లు పెరిగితే పెరగవచ్చని పేర్కొంది.
బీజేపీ హైదరాబాద్ కంటే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సిగ్మెంట్లలో బలంగా ఉందని సర్వేలో తేలింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో బలంగా తయారైందని సర్వే రిపోర్టులో పేర్కొంది. ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ సర్వే లో కూడా మరల బీఆర్ఎస్ కే స్పష్టమైన మెజార్టీ వస్తుందని తెలిపింది. పలు సర్వేలతో ఆందోళనలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు ఈ రెండు సర్వే సంస్థల వెల్లడించిన రిపోర్టులు బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది.