Telangana BJP: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత (ప్లోర్ లీడర్) పదవి ఎవరికి లభిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉన్నది ఎనిమిది మంది సభ్యులే అయినా ప్లోర్ లీడర్ ఎంపిక వ్యవహారంపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. గత సభలో ప్లోర్ లీడర్ గా ఉన్న రాజాసింగ్ నే కొనసాగిస్తారా .. లేక కొత్తగా ఎన్నికైన వారిలో ఎవరికైనా అప్పగిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీలో ప్లోర్ లీడర్ అంశం ఇప్పుడు ఆ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది అన్న దానిపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన అతిరథ మహారధులు ఓటమి పాలైయ్యారు. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వంటి వారు ఓటమి పాలైయ్యారు. ఈటల, బండి సంజయ్ లు గెలిచి ఉంటే వీరిలో ఒకరికి ప్లోర్ లీడర్ పదవి లభించేది. కానీ గోషామహల్ నుండి రాజాసింగ్ మూడో సారి అసెంబ్లీకి ఎన్నికైయ్యారు.
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుండి ఏలేటి మహేశ్వర రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఏలేటి కొంత కాలం క్రితమే బీజేపీలో చేరారు. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అసెంబ్లీ కార్యకలాపాల విషయంలో అనుభవం ఉన్న వారు ఇద్దరే రాజాసింగ్, ఏలేటి మహేశ్వరరెడ్డి లు ఉండటంతో ప్లోర్ లీడర్ గా ఎవరిని ఎంపిక చేస్తారు అనే చర్చ ఆ పార్టీలో నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎవరి పేరును సిఫార్సు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీలో రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించడంతో ఆయనే ఎల్పీ నేతగా కొనసాగారు. తర్వాత ఉప ఎన్నికల్లో దుబ్బాక నుండి రఘునందన రావు, హూజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ లు గెలుపొందినప్పటికీ ప్లోర్ లీడర్ గా రాజాసింగ్ నే కొనసాగించారు. రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసినా కూడా ఆ పదవి మరొకరికి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వరుసగా మూడో సారి ఎన్నికైన రాజాసింగ్ నే మరో సారి ప్లోర్ లీడర్ గా పార్టీ అధిష్టానం ఎంపిక చేస్తుందా లేక మరొకరికి ఆ బాధ్యత అప్పగిస్తుందా అనేది చర్చనీయాంశం అవుతోంది.
ప్లోర్ లీడర్ అంశంలో రాజాసింగ్, ఏలేటి మహేశ్వరరెడ్డి ల మధ్య పోటీ నెలకొని ఉండగా, పార్టీలో ఓ వర్గం కామారెడ్డిలో గత ముఖ్యమంత్రి కేసిఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విజయం సాధించి జయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న కాటిపల్లి వెంకట రమణారెడ్డి ని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తొంది. బెంగాల్ లో ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారిని బీజేపీ ఎల్పీ నేతగా ఎంపిక చేసి ఆయన ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేస్తొంది. అదే విధంగా ఇక్కడ కూడా వెంకట రమణారెడ్డిని శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేయాలని సూచిస్తున్నారు.
కాటిపల్లి సమస్యలపై మాట్లాడగలరనీ, ఆయనలో పోరాటతత్వం ఉందని పార్టీని కొందరు అంటున్నారు. అయితే తాను ప్లోర్ లీడర్ రేసులో లేనని వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. తన ఆస్తులు అమ్మి అయినా నియోజకవర్గంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ హైకమాండ్ రాజాసింగ్, ఏలేటిలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనేది తేలాలంటే మరో రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిందే.
Balineni Srinivasa Reddy: ఏపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు