టీడీపీ-జనసేన టికెట్ల పంపిణీ తర్వాత ఆయా పార్టీల్లో అసంతృప్తులు పెల్లుబికాయి. ఇది సహజం అందరూ ఊహించిందే. అయి తే.. ఆ వెంటనే నాయకులు.. జంపింగులు చేస్తారని అందరూ అనుకున్నారు. ఇది కూడా సహజమే. వైసీపీలో టికెట్లు దక్కవని భావించిన నాయకులు కొందరు టీడీపీలోకి వచ్చారు. వీరిలో దాడి వీరభద్రరావు కుటుంబం సహాపలువురు నాయకులు ఉన్నా రు. అయితే.. వీరికి టికెట్లు ఇచ్చారా ? ఇవ్వలేదా ? అనే విషయం పక్కన పెడితే..
అసలు పార్టీ అయితే మారిపోయారు. మరి ఇలానే టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ.. ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీవైపు చూడలేదు.
అసంతృప్తులు మాత్రం పెల్లుబికాయి. ఇరు పార్టీల నాయకులు కూడా తీవ్రస్థాయిలో రగులుతున్నారు. అయితే.. వారి చూపు మాత్రం వైసీపీపై పడడం లేదు. ఒక్క విజయవాడ ఎంపీ, తిరువూరు మాజీ ఎమ్మెల్యేలు మినహా వైసీపీలోకి వచ్చిన టీడీపీ నాయకులు లేకుండా పోయారు. దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనే విషయాలు ఆసక్తిగా ఉన్నాయి. వైసీపీ కంటే టీడీపీనే బెటర్ అని తమ్ముళ్లు భావిస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీలోకి వచ్చినా.. టికెట్లు దక్కే పరిస్థితి లేదు. పైగా..కేడర్లోనూ తమ బలం పూర్తి గా పోతుంది. రేపు వారు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. దీంతో టీడీపీ నుంచి ఎవరూ తాజాగా వైసీపీవైపు చూడడం లేదు.
మరోవైపు.. జాబితా ప్రకటించిన వెంటనే చంద్రబాబు యాక్షన్ మొదలు పెట్టేశారు. టికెట్లు రాని సీనియర్లను తనచెంతకు పిలుచుకుని చర్చిస్తున్నారు. అదేసమయంలో వారికి హామీలు కూడా గుప్పిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే వారు పార్టీలోనే ఉండిపోవాలని దాదాపు నిర్ణయానికి వచ్చేశారు. పైగా కొన్ని దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్నవారు కావడంతో (ఉదాహర ణకు.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ వంటి వారు) వారు పార్టీలో టికెట్ వచ్చినా రాకున్నా కూడా.. అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వైసీపీ వైపు వస్తారని ఆ పార్టీ ఎదురు చూసినా.. ద్వారాలు తెరిచే ఉన్నాయని.. వైసీపీ నేతలు సంకేతాలు పంపించినా.. పెద్దగా రియాక్షన్ కనిపించలేదు.
ఇక, జనసేనకు 24 స్థానాలు ఇవ్వడం పట్ల ఆ పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. సూర్చచంద్ర వంటి నాయకులు రోడ్డెక్కి, కొంత యాగీ చేసినా.. వెంటనే సర్దుకున్నారు. దీంతో ఇక్కడ కూడా వైసీపీకి నిరుత్సాహమే ఎదురైంది. దీనికి ప్రధాన కారణం.. జనసేన అధినేత పవన్పై పార్టీ నాయకులకు ఉన్న అభిమానం. పార్టీని బలంగా గెలిపించుకోవాలన్న పట్టుదల వంటివి స్పస్టంగా కనిపించాయని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో అసంతృప్తులు ఉన్న మాట నిజమే అయినా.. నాయకులు లోలోన రగిలిపోతున్నా తాడేపల్లి వైపు మాత్రం ఎవరూ చూడలేదు. దీంతో వైసీపీ నాయకులు పెట్టుకున్న ఆశలు నిరాశగానే మిగిలిపోయానని అంటున్నారు పరిశీలకులు.