టీడీపీ సీనియర్ నాయకుడు, తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ శాంతించా రు. తాజాగా ప్రకటించిన టీడీపీ-జనసేన మిత్రపక్షం తొలిజాబితాలో ఈ సీటును జనసేన నేత, గత ఎన్నికల్లో ఓడిపోయిన నాదెండ్ల మనోహర్కు కేటాయించారు. వాస్తవానికి ఈ సీటుపై ఆలపాటి చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ సీటును నాదెండ్లకు కేటాయించే పరిస్థితి వచ్చింది. దీనిపై గత ఆరు మాసాల కిందటే చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు.
దీంతో అప్పటి వరకు నిత్యం మీడియా ముందుకు వచ్చిన ఆలపాటి.. తర్వాత తర్వాత.. తన దూకుడును తగ్గించుకున్నారు. కొన్ని నెలల పాటు అమెరికాలో ఉండి వచ్చారు. మరోవైపు కేడర్ నుంచి ఒత్తిళ్లు కూడా ఉన్నమాట వాస్తవం. అయితే.. మరో దారి లేకుండా పోవడంతోపాటు పార్టీకి వీరవిధేయుడు అన్న ట్యాగ్ ఆయనను నిలువరించింది. దీంతో నియోజకవర్గానికే ఆయన పరిమితం అయ్యారు. తాజాగా చంద్రబాబు ఆయనను బుజ్జగించారు.
ఆలపాటికి టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆలపాటి తన పేరును గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు నుంచి అయినా పరిశీలించాలని పెట్టుకున్న విన్నపాలు కూడా టీడీపీ అధిష్టానం బుట్టదాఖలు చేసింది. చివరకు చంద్రబాబు గుంటూరు పార్లమెంటుకు పోటీ చేయమన్నా ఆర్థిక కోణాల నేపథ్యంలో తాను చేయలేనని తేల్చిచెప్పారు.
ఈ క్రమంలోనే తీవ్ర అసంతృప్తితో ఉన్న క్రమంలోనే టీడీపీ అధినేత నుంచి పిలుపు రావడంతో అమరావతికి వచ్చిన ఆలపాటి రాజేంద్రప్రసాద్.. చంద్రబాబుతో భేటీ అయ్యా రు. టికెట్ రాకపోవడంపై ఆలపాటిని చంద్రబాబు సముదాయించారు. ఆయన రాజకీయ భవిష్యత్ కు హామీ ఇవ్వడంతో ఆలపాటి వెనక్కి తగ్గారు. ఇక, ఈ భేటీలో ఆలపాటికి కీలకమైన మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు.. టికెట్ దక్కని వారిలో హేమా హేమీల వంటివారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవులు కట్టబెడతామని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ జాబితాలో గంటా శ్రీనివాసరావు కూడా ఉండడం గమనార్హం. అదేవిధంగా దేవినేని ఉమా కు టికెట్ ఇస్తే.. ఓకే లేకుంటే.. మంత్రి పీఠం ఖాయమని తేల్చి చెప్పినట్టు తెలిసింది. మొత్తంగా ఆలపాటిని లైన్లో పెట్టుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అయితే.. నియోజకవర్గంలో కేడర్ ఏమేరకు కలిసి వస్తుందనేది చూడాలి.