రాష్ట్రంలో ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న కొద్దీ.. రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల పార్టీలు మారిన(ఫిరాయించిన) ఎనిమిది మంది(నలుగురు వైసీపీ+నలుగురు టీడీపీ) ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. అయితే..వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయచ్చా? లేదా? అనే దానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. ఇక, దీనిని వారు కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని తెలిసింది. ఇదిలావుంటే, ఇప్పుడు ఎమ్మెల్సీల వంతు వచ్చింది.
పార్టీ మారిన ఎమ్మెల్సీలపైనా వైసీపీ అనర్హత వేటు వేయించాలని భావిస్తున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబు తున్నాయి. అధికార వైసీపీ నుంచి తెలుగుదేశం, జనసేనలో చేరిన వంశీకృష్ణ యాదవ్, సి. రామచంద్ర య్యకు మండలి ఛైర్మన్ మరోసారి నోటీసులు పంపడం చూస్తుంటే వేటు తప్పదనిపిస్తోంది. ఎన్నికల వేళ నేతలు పార్టీలు మారడం సర్వసహజం. సాధారణంగా ప్రతిపక్షం నుంచి అధికారపార్టీలోకి వలసలు పెరుగుతాయి. దీనికి తోడు ఎమ్మెల్యే ట్రాన్స్ ఫర్ వంటి వినూత్న పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టడంతో చాలామంది నేతలు ముందే మేల్కొన్నారు.
నియోజకవర్గాన్ని, నమ్ముకున్న వర్గాన్ని వీడటం ఇష్టం లేక…వైసీపీనే వీడారు. అలాంటి వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలేగాక ఎమ్మెల్సీలు ఉన్నారు. జగన్ తీరుతో విభేదించి ఇటీవలే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్య ఆ పార్టీని వీడారు. ఒకరు టీడీపీ, మరొకరు జనసేనలో చేరిపోయారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా వైసీపీ మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు ఇవ్వడంతో గతంలో ఒకసారి నోటీసు పంపారు.
ఇప్పడు మరోసారి నోటీసులు పంపారు. తుది విచారణకు ఈనెల 5న హాజరుకావాలని ఆదేశారు. రెండోసా రి కూడా నోటీసు పంపడం చూస్తే…వీరిద్దరిపైనా వేటు వేయడం ఖాయమని సమాచారం. అయితే.. వీరికి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం లేకపోయినా.. ఎమ్మెల్సీ పదవులు పోయే అవకాశం ఉంది. కానీ, వీరు న్యాయపోరాటాన్ని ఎంచుకుంటే.. అది తేలే వరకు వీరి పదవులకు ఎలాంటి ఇబ్బందీ రాదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై శాసనసభాపతి వేటు వేశారు.
పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి నోటీసులిచ్చిన సభాపతి తమ్మినేని సీతారాం.. ఆతర్వాత వారిపై అనర్హత వేటు వేశారు. తాజాగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నరసరాపుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు సైతం తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తాము తెలుగుదేశంలో చేరామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్, లావు శ్రీకృష్ణదేవరాయులపై వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.