అధికార పార్టీ వైసీపీలో మరో రగడ ప్రారంభమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అనంతపురం అర్బ న్ టికెట్ వ్యవహారం నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతోంది. ఈ టిక్కెట్ కోసం సీనియర్ నేతలు తీవ్రస్థా యిలో ప్రయత్నిస్తున్నారు. ఈ టికెట్ను పార్టీ ఇంకా ఎవరికీ ప్రకటించలేదు. దీంతో తనకే ఉంటుందని సిట్టింగ్ నాయకుడు అనంత భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ అనంత వెంకటరామిరెడ్డి ఒకవైపు, ఐదుగురు నేతలు ఒకవైపు ఉండి ప్రయత్నాలు సాగించారు.
అధిష్టానం అనంత వెంకటరామిరెడ్డి వైపు మొగ్గు చూపింది. ఈసారి మార్పు చేపడితే తమకు అవకాశం కల్పించాలని చవ్వా రాజశేఖర్రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాసులు, వైటి.శివారెడ్డి, నదీమ్ అహమ్మద్, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అటు మైనార్టీ, ఇటు బలిజ సామాజిక తరగతులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నందు వీరికి అవకాశం కల్పించాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది.
అయితే అనంత వెంకటరామిరెడ్డి మాత్రం పార్టీలో తనకున్న పట్టుతో సైలెంట్గా చక్రం తిప్పుతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గడపగడపకు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు, తాను చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.
నగరంలో ఎక్కడా ఎటువంటి సమస్యలేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగారన్న చర్చ నడిచేలా అనంత చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. సీనియర్ నాయకుడిగానూ అనంత వెంకటరామిరెడ్డికి మంచి పేరుంది. 1996 నుంచి ప్రజాప్రతినిధిగా ఉంటూ వస్తున్నారు. 2019లోనే తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో జిల్లా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నారు.
అయితే, ఆయన ముందు నుంచి అసమ్మతిని ఎదుర్కొంటూ వస్తునే ఉన్నారు. ఆ ఐదుగురు నేతలు ఈసారైనా మార్పు చేపట్టి తమలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ, వారికి పెద్దిరెడ్డి అభయం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఖచ్చితంగా అనంతవైపే మొగ్గు చూపుతుందనే చర్చ సాగుతుండడం గమనార్హం.