ఒకరు తర్వాత.. ఒకరు సహజంగా ఎన్నికలకు ముందు పార్టీలు మారతారు. తమకు టికెట్ దక్కలేదనో.. లేక.. తమ ఆశలు నెరవేరలేదనో భావించి ఎన్నికలకు ముందు జంప్ చేస్తుంటారు. అయితే.. ఎక్కడా కూడా.. భారీ సంఖ్యలో మూకుమ్మడిగా నాయకులు జంప్ చేసిన పరిస్థితి లేదు. 2019ఎన్నికలకు ముందు కూడా.. వైసీపీలోకి చేరిన వారు ఎక్కడా మూకుమ్మడిగా టీడీపీ నుంచి బయటకు రాలేదు. కానీ, చిత్రంగా ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వస్తున్నవారి సంఖ్య భారీగానే ఉంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాను తీసుకుంటే, ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటు వారి పరివారం కూడా పార్టీకి దూరంగా ఉంది. ఇక, సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్కుమార్కు నిన్న మొన్నటి వరకు చేదోడుగా ఉన్న సొంత బాబాయి రూప్ కుమార్ వర్గం మూకుమ్మడిగా పార్టీ మారి.. టీడీపీకి జై కొట్టింది. ఇక, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కుటుంబ సమేతంగా పార్టీ మారారు. ఈ క్రమంలో కీలకమైన పదవులు కూడా వదిలేసుకున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయింది.
ఇక, ఉమ్మడి చిత్తూరులోనూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసీపీకి దూరమై.. టీడీపీ చెంతకు చేరుకున్నా రు. ఇక్కడ టికెట్ హామీ ఇచ్చారో లేదో తెలియదు కానీ, ఆయన మాత్రం పసుపు కండువా కప్పుకొన్నారు. తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా పార్టీ మారిపోయి జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఇక, చిత్తూరులో బలమైన నాయకుడిగా ఉన్న సీకే బాబు..టీడీపీకి జై కొట్టారు. మొత్తంగా చూస్తే.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ బలహీన పడుతోంది.
గత 2019 ఎన్నికల్లో నెల్లూరును వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. చిత్తూరులో ఒక్క కుప్పం మినహా అన్ని నియో జకవర్గాలను వడిసి పట్టుకుంది. దీనికి కారణం.. పైకి జగన్ చేసిన పాదయాత్ర, వైసీపీ ఇమేజ్ అని అంటున్నా.. అంతర్గతంగా నాయకుల బలమే వైసీపీని ముందుకు నడిపించింది. అలాంటిది ఇప్పుడు జరగనున్న ఎన్నికల ముందు.. కీలకమైన.. ఆయా సామాజిక వర్గాలకు నేతృత్వం వహించి ముందుకు నడిపించే నాయకులు ఒక్కొక్కరుగా కాదు.. ఒక్కుమ్మడిగా పార్టీ మారుతుండడంతో వైసీపీ పరిస్థితి ప్రమాదంలో చిక్కుకుందనే సూచనలు వస్తున్నాయి. మరి జగన్ ఏం చేస్తారోచూడాలి.