న్యూఢిల్లీ: వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో మీడియా చర్చా కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ పార్టీ అధికార ప్రతినిధులు, నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. ఇక సున్నిత అంశమైన ఈ తీర్పుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాతే తాము స్పందిస్తామని ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
మరో వైపు బిజెపి అధిష్టానం సైతం టివి చర్చా కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ అధికార ప్రతినిధులకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పార్టీ అధికార ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.
అయోధ్య తీర్పు నేపథ్యంలో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా ఆంధ్రప్రదేశ్లో ఆదివారం జరుగనున్న ఆయన పర్యటనను వాయిదా వేసుకున్నారు. బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన కార్యక్రమం రద్దయినట్లు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.