న్యూఢిల్లీ: రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం నిర్మించేందుకు దానిని వెంటనే అయోధ్య ట్రస్టుకు అప్పగించాలనీ కోర్టు తీర్పు చెప్పింది. కేంద్రం మూడు నెలల్లో ఆ ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.
వివాద స్థలాన్ని మూడు భాగాలుగా పంచాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పు సరైనది కాదని ధర్మాసనం ప్రకటించింది. స్థలాన్ని పంచడం ఎట్టిపరిస్థితుల్లో కుదరదని కోర్టు తేల్చింది. న్యాయ వ్యాజ్యంలో పాలుపంచుకోగలిగిన వ్యక్తిగా రామ్ లల్లాను పరిగణిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. 2.77 ఎకరాల వివాద స్థలంపై యాజమాన్య హక్కులు రామ్ లల్లాకే ఇస్తున్నట్లు కోర్టు తేల్చింది. రామజన్మభూమిని మాత్రం కక్షిదారుడుగా పరిగణించలేమని కోర్టు తెలిపింది.
వివాదాస్పద స్థలం ఓ పెద్ద సంకీర్ణ స్థలమనీ, అక్కడ బయటి వసారాలో హిందువులు పూజ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయనీ సుప్రీంకోర్టు తెలిపింది. బయటి వసారా ఎప్పుడూ కూడా ముస్లింల అధీనంలో లేదు. అయితే ముస్లింలకు కట్టడం లేకుండా చేయలేం. వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించాలి.. లోపలి వసారా, బయటి వసారా భూమిని అయోధ్య ట్రస్టుకు అప్పగించాలి. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే అయిదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయోధ్య వివాదంపై 1945 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. నిర్మోహీ అఖాడా దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు తోసేపుచ్చింది. వివాదాస్పద స్థలంలో పూజలు చేసే హక్కు అఖాడాకు లేదని కోర్టు తెలిపింది.
బాబరీ మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదన్న కేంద్ర పురావస్తుశాఖ (ఎఎస్ఐ) నివేదికను విశ్వసిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఆ కట్టడం కింద మరో కట్టడం ఆనవాళ్లు ఉన్నాయని ఎఎస్ఐ తెలిపింది. రాముడు అయోధ్యలోనే జన్మించాడనడానికి ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొన్నది. మసీదు నిర్మాణం కోసం మందిరాన్ని కూల్చారనడానికి మాత్రం ఆధారాలు లేవు. బాబర్ కాలంలోనే బాబరీ మసీదు నిర్మాణం జరిగింది. అయితే కట్టింది ఆ రాజు కాదు. ఆయన సైనికాధికారులు బాబరీ మసీదు నిర్మించారు. అక్కడ ఉన్నది మసీదా లేక ఆలయమా అన్నది నిర్ధారించేందుకు కూడా ఆధారాలు లేవని సుప్రీం కోర్టు పేర్కొన్నది.
రాముడు అయోధ్యలోనే జన్మిచాడని హిందువులు నమ్మకం. మత విశ్వాసాలు వారివారి వ్యక్తిగత విషయాలు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాదాస్పద స్థలంలో హిందువులు పూజలు చేసేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజు చేసేవారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. 1949 డిసెంబర్లో అక్కడ చివరిసారి నమాజు చేశారు. మత విశ్వాసాల ఆధారంగా ఈ స్థలం ఎవరిదన్నది తేల్చలేం. వివాద స్థలంపై హక్కులు తేల్చాల్సింది రికార్డులే. సున్నీ వక్ఫ్ బోర్డు వివాద స్థలంపై యాజమాన్య హక్కులు నిరూపించలేక పోయింది. సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే తీర్పు ఇవ్వగలమని ధర్మాసనం తెలిపింది.
బాబరీ మసీదు కూల్చివేతను సుప్రీంకోర్టు తప్పు పటింది. అది చట్టవ్యతిరేక చర్య అని స్పష్టం చేసింది. 1949లో వివాదస్థలంలో దొంగతనంగా రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టించిన చర్య కూడా చట్టవ్యతిరేకమేనని కోర్టు పేర్కొన్నది.