అమరావతి: కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ సోదరులు వైసిపిలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు అయిందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిమాణాలతో జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. జమ్మలమడుగులో ఆది కుటుంబం తొలి నుండి వైఎస్ కుటుంబానికి విధేయతగానే ఉంటూ వచ్చింది. 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి 2014 ఎన్నికల్లో వైసిపి నుండి గెలిచి హాట్రిక్ సాధించారు. అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదినారాయణరెడ్డిని టిడిపిలో చేర్చుకొని మంత్రివర్గంలో స్థానం కల్పించారు. టిడిపిలో మంత్రిగా ఉన్నంత కాలం ఆదినారాయణరెడ్డి నాటి ప్రతిపక్ష నేత,నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి ఘోర పరాజయం పాలవ్వడంతో ఆదినారాయణరెడ్డి కొంత కాలం టిడిపికి దూరంగా ఉండి ఇటీవలే బిజెపిలో చేరారు.
అయితే ఆయన సోదరులు ఎమ్మెల్సీ శివనాధరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు వారి వర్గీయులతో తిరిగి జగన్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్ మంజూరుతో పాటు పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్ కల్పించాలని జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాలను ఆది సోదరులు ప్రశంసించారు. ఈ నెల 23న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు విచ్చేస్తున్న సిఎం జగన్ సమక్షంలో వీరు వైసిపిలో చేరేందుకు మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో వారి చిరకాల ప్రత్యర్థి, టిడిపి నేత రామసుబ్బారెడ్డి సైతం వైసిపితో సంబంధాలు పెట్టుకుంటున్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వీరు ముందడుగు వేసినట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది.