(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను శుక్రవారం మధ్నాహ్నం సీఎంకు అందచేయనుందని సమాచారం. దీంతో ఏపీ రాజధాని భవితవ్యం తేలిపోనుంది. ముఖ్యమంత్రి సంకేతాలిచ్చిన మూడు రాజధానుల అంశంపై స్పష్టత రానుంది. ఇప్పటికే ఏపీకి మూడు రాజధానులు వస్తాయేమోనంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అటు విపక్ష టీడీపీతోపాటు, ఇటు అధికారపక్షం వైసీపీలో కూడా ఈ అంశంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రాంతాల వారీగా నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, గందరగోళ పరిస్థితి నెలకొంది.
సీఎం జగన్ ప్రకటనపై రాజధాని రైతులు భగ్గుమన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం 3.30కి.. సీఎం క్యాంపు ఆఫీస్లో ముఖ్యమంత్రి జగన్తో.. జీఎన్ రావు కమిటీ భేటీ కానుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధానిపై అధ్యయనం చేసిన ఈ నిపుణుల కమిటీ.. ఈ రోజే తుది నివేదిక సమర్పించే అవకాశముంది. ఏపీ రాజధాని..13 జిల్లాల అభివృద్ధికి సంబంధించి కమిటీ తమ నివేదికలో చేసే సూచనలు కీలకం కానున్నాయి. సీఎం చెప్పిన అంశాలే ఉంటాయా..భిన్నంగా ఏవైనా సూచనలు చేసారా ? అన్నది ఉత్కంఠగా మారింది. అసలు నివేదికలో ఏం పొందుపరిచారన్న దానిపై ఏపీ ప్రజల్లో టెన్షన్ నెలకొంది.
కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు సీఎం జగన్.. ఏపీకి మూడు రాజధానులు వచ్చే అవకాశముందని.. అందులో భాగంగా.. అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ ఏర్పాటయ్యే అవకాశముందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జగన్ చేసిన ప్రకటనపై విపక్షాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. టీడీపీ, జనసేన వ్యతిరేకిస్తుంటే.. బీజేపీ మాత్రం జగన్ నిర్ణయానికి జైకొట్టింది. మరోవైపు వైసీపీ నేతల్లో కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.