అమరావతి: ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీ ఎమ్మెల్యే విభేదించారు. అసెంబ్లీ, సచివాలయం ఒకే చోట ఉండాలని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా అమరావతి ఉండాలని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒక్కచోటే ఉండాలన్నది తన అభిమతమని తెలిపారు. పరిపాలన విభాగమంతా ఒకే చోట ఉంటేనే బాగుంటుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చి నష్టపోయామన్నారు. విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని చెప్పారు. నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం సరైన నిర్ణయమే తీసుకుంటారని ఆయన ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతోంది. సీఎం జగన్ వ్యాఖ్యలతో సొంతపార్టీ ఎమ్మెల్యే విభేదించడం చర్చనీయాంశమైంది. ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు స్వాగతిస్తున్నారు. విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటిల్ ఏర్పాటు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టగా… టీడీపీలోని కొందరు నేతలు మాత్రం తమ ప్రాంతానికి రాజధాని రావడాన్ని స్వాగతించారు. అయితే, అమరావతి విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలంతా ఒకే రకమైన వాదనతో ఉన్నారని అంతా అనుకున్నారు. అయితే అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గళం వినిపించడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీతో పాటు వైసీపీలోనూ భిన్నాభిప్రాయాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది.