(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంట చేస్తుండటంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటు వెలగపూడిలో రైతులు రిలే దీక్షలు చేపట్టారు. మూడు రాజధానులు వద్దు – అమరావతే ముద్దు అంటూ ప్లకార్డులతో ప్రదర్శనకు దిగారు. తమ త్యాగాలను అవమానించవద్దని రైతులు నినాదాలు చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టోద్దనీ, మంత్రులు అవగాహనతో మాట్లాడాలనీ రైతులు కోరుతున్నారు. రాజధానిలో ఇప్పటి వరకు నిర్మించిన రోడ్లు, భవనాలు ఏమి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. భూములు తిరిగి ఇచ్చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి అనడంపై రైతులు మండిపడుతున్నారు. భూములు ఎలా తీసుకున్నారో అలానే అప్పగించాలని డిమాండ్ చేశారు. భూముల్లో భవనాలు, రహదారులు, కాల్వలు నిర్మించి ఇప్పుడు వెనక్కి ఇచ్చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. పెయిడ్ ఆర్టిస్తులని అంబటి అనడాన్ని వారు తప్పుబడుతూ వెలగపూడి వద్ద దీక్షలో పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులు పట్టుకొని కూర్చున్నారు. దీక్షలకు ఇతర ప్రాంతాల నేతలు, సంఘాలు మద్దతు ఇస్తున్నా స్థానిక నేతలు మాత్రం బయటకు రావడం లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ దాక్కున్నారంటూ మండిపడ్డారు.కేంద్రమే తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో రైతులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు. రైతుల ఆందోళనకు జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, కొణిదెన నాగబాబు తదితర నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించనున్నారు.