ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఖచ్చితంగా మరో 15 రోజులు మాత్రమే ప్రచారా నికి సమయం ఉంది. 16వ రోజు.. పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తంగా నాయకులు, అభ్యర్తులు, పార్టీ లు ఇలా ఏ విధంగా చూసుకున్నా.. ప్రచారానికి రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలు ఎలా దూసుకుపోతాయి? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలో రెండు దశల ప్రచారం పూర్తి చేసి.. మూడో దశ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఆదివారం నుంచి జగన్ విజయయాత్ర పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక, ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. దీనిలో పెద్దగా మెరుపులు మురిపించకపోయినా.. ఉన్నదేదో ఇస్తానని.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని మాత్రం స్పష్టం చేశారు. పింఛన్ల విషయంలో విపక్షాల వ్యూహంలో జగన్ చిక్కుకుపోలేదు. వారు 4000 పింఛన్ పెంచుతానని చెప్పినా.. జగన్ దాని ఊసు కూడా ఎత్తలేదు. అంటే.. చాలా వ్యూహాత్మకంగా జగన్ పనిచేస్తున్నారు.
ఇక, విపక్షాలకు ఉన్న సమయం కూడా.. 15 రోజులే. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ వంటి వారు దూకుడు పెంచారు. ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అయితే.. సుడిగాలి పర్యటనలకు ప్రాదాన్యం ఇస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచారంలో ఆయన జిల్లాలు, నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగానే ముందుకు సాగుతోంది. మొత్తంగా చూస్తే.. కౌంట్ డౌన్ 15 అందరినీ కలవరపరుస్తున్నదన్నది వాస్తవం.
అయితే.. ఇక్కడ మరో కీలక విషయం కూడా తెరమీదికి వచ్చింది. ఉమ్మడిగా పోరుకు వెళ్తున్న.. కూటమి పక్షాలు ఇప్పటి వరకు మేనిఫెస్టోను విడుదల చేయలేదు. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని చంద్రబాబు చెప్పినా.. ఇప్పటి వరకు ఆదిశగా అయితే.. అడుగులు వేయలేదు. దీంతో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా? లేక.. ఎవరికి వారే మేనిఫెస్టో ప్రకటించుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది. మరో వారంలో ప్రధాని మోడీ కూడా.. ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.