చాలా ఏళ్ల తర్వాత.. వంగవీటి రాధాకు టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. కాపులు అత్యధికంగా ఉన్న అవనిగడ్డ నియోజకవ ర్గంలో ఆయనను బరిలో నిలపడం దాదాపు ఖాయమైంది. ఈ సీటును టీడీపీ అనేక కోణాల్లో పరిశీలించిన తర్వాత.. మధ్యే మార్గంగా జనసేనకు ఇచ్చేసింది. టీడీపీ నుంచి ఎవరు బరిలో దిగినా.. సొంత నేతల నుంచే వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చాలా పక్కాగా లెక్కలు వేసుకుని.. గెలిచే స్థానాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక.. జనసేనకు ఇచ్చేశారని అంటున్నా రు. దీంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు జనసేన ఖాతాలో పడింది.
ఇక, జనసేన తరఫున ఇక్కడ పోటీకి ఇద్దరు అభ్యర్థులు ఇప్పటికే ఉన్నారు. వీరిలో విక్కుర్తి వెంకట శ్రీనివాస్, మరొకరు మదివాడ వెంకట కృష్ణ. వీరిద్దరూ జనసేనలో బాగానే పనిచేస్తున్నారు. అధినేత పట్ల ఆప్యాయత కూడా కురిపిస్తున్నారు. దీంతో వీరిలో ఒకరికి ఇవ్వాలని ముందు అనుకున్నారు. ఇందులోనూ విక్కుర్తి వైపు పవన్ మొగ్గు చూపించారు. అయితే.. ఇంతలోనే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మెరుపులాంటిఆలోచన చేశారు. అవనిగడ్డను వైసీపీ కీలకంగా తీసుకున్న నేపథ్యంలో.. తన పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ సీటును వైసీపీకి దక్కకుండా చేసే వ్యూహం వేశారు.
దీనిలో భాగంగానే.. వంగవీటి రాధాను ఇక్కడ నుంచి రంగంలోకి దింపాలని ఆయనే స్వయంగా పవన్కు ప్రతిపాదించారు. మొదట్లో దీనిపై పవన్ కొంత తర్జన భర్జన పడినా.. తర్వాత మాత్రం రాధావైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో పార్టీ నాయకులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించారు. ఈ పరిశీలనలో రాధాకు మంచి మార్కులు పడినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు రకాలుగా నివేదికలు జనసేనకు చేరాయని అంటున్నారు. ఒకటి జనంలో రాధా అభిమానులు ఎంత మంది ఉన్నారు? జనసేనకు ఇక్కడ ఉన్న పాజిటివిటీ ఏంటనే విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేయించారు.
ఈ క్రమంలో వంగవీటి అనుచరులు.. పాతకాపులు ఇక్కడ రాధావైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అదేవిధంగా మెగా అభిమానులు.. బాలశౌరి పాజిటివిటీ వంటివి కూడా నియోజకవర్గంలో వర్కవుట్ అవుతున్నాయని లెక్కలు వేసుకున్నారు. అయితే.. విక్కుర్తికి టికెట్ ఇస్తానని గతంలో పవన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన విషయాన్ని కూడా ఈ సర్వేల్లోనే తేల్చారు. అయితే.. విక్కుర్తి కంటే కూడా.. రాధా అయితే.. బలమైన నాయకుడు అవుతారని లెక్కలు వచ్చినట్టు సమాచారం. దీంతో తాజాగా రాధాకు సీటును కన్ఫర్మ్ చేసినట్టు పార్టీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ రానుందని.. తర్వాత.. రాధా పార్టీలోకి చేరడం టికెట్ తీసుకోవడం ఖాయమని అంటున్నారు.