ధనం మూలం ఇదం జగత్. ఆ ధనానికి అధిదేవత శ్రీలక్ష్మీదేవి. అయితే ఆ అమ్మ అనుగ్రహం కోసం మన పూర్వీకులు అనేక పరిహారాలు, పూజావిధానాలను చెప్పారు. వాటిలో ఒకటి ఉసిరికాయకు సంబంధించినది. ఆ విశేషాలు తెలుసుకుందాం…
పలు పురాణాలలో చెప్పిన ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు, అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం.
శ్రీ శంకరాచార్యులవారు విరచించిన కనకధారా స్తోత్రం పఠించిన తరువాత ఉసిరికాయ బొబ్బట్టు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించడం వల్ల శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఉసిరికాయ దీపంతో శ్రీమహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం నివారింపబడుతుంది. అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీక మాసంలో ధాత్రి హవనం తరువాత ఉసిరికాయను హోమం పూర్ణాహుతికి సమర్పిస్తే చక్కటి ఫలితాలు కలుగు తాయని పండితుల అభిప్రాయం.